Modi Cabinet News: ప్ర‌ధాని మోడీ క్యాబినెట్ లో కీల‌క మార్పులు జ‌రిగాయి. కేంద్ర మంత్రులు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ఆర్‌సిపి సింగ్ రాజీనామా చేయ‌డంతో కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీ, మ‌రో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాలకు ఇద్దరు మంత్రుల మంత్రిత్వ శాఖల బాధ్యతలు అప్పగించబడ్డాయి.

Modi Cabinet News: ప్ర‌ధాని మోడీ క్యాబినెట్ (Modi Cabinet) లో కీల‌క మార్పులు జ‌రిగాయి. కేంద్ర మంత్రి మండలి నుండి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ఆర్‌సిపి సింగ్ రాజీనామాలు చేయ‌డం. రాష్ట్రపతి వెంటనే ఆమోదించ‌డం. అదే సమయంలో.. కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీకి, మ‌రో కేంద్ర‌మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. 

కేంద్ర‌మంత్రి స్మృతి ఇరానీకి ప్రస్తుతం ఉన్న పోర్ట్‌ఫోలియోతో పాటు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను అప్ప‌గించారు. అలాగే.. మ‌రో కేంద్ర‌మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ప్రస్తుతం ఉన్న పోర్ట్‌ఫోలియోకు అదనంగా ఉక్కు మంత్రిత్వ శాఖను కూడా అప్పగించారు.

ప్రధాని మోడీ సలహా మేరకు కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రిగా వ్య‌వ‌హరిస్తున్న‌ స్మృతి జుబిన్ ఇరానీకి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే..కేంద్ర‌ కేబినెట్ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ప్రస్తుతం ఉన్న పౌర విమానయాన శాఖతో పాటు ఉక్కు మంత్రిత్వ శాఖను కూడా అప్పగించారు.

ప్రధాని మోదీ ప్రశంస 

కేంద్ర‌ కేబినెట్ (Modi Cabinet) సమావేశానికి ముందు కేంద్ర‌మంత్రులు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, ఆర్‌సిపి సింగ్ ఇద్దరికి ప్ర‌శంసించారు. వారు తమ మంత్రి పదవీ కాలంలో అందించిన సహకారాన్ని ప్రధాని మోదీ అభినందించారు. బుధ‌వారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఇరువురు నేతలకు చివరిది అని ప్రధాని ప్రశంసించడం ఒక సూచనగా భావించారు. వారిద్ద‌రి రాజ్యసభ పదవీకాలం గురువారంతో ముగియనుంది

శుక్రవారం నుంచి ఎంపీల పదవికి స్వస్తి పలకనున్నందున తమ రాజ్యాంగ బాధ్యతను నెరవేర్చేందుకు మంత్రులిద్దరూ రాజీనామాలు సమర్పించారు. బీజేపీ సీనియర్ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా కూడా ఉన్నారు. అదే సమయంలో, RCP సింగ్ JD (U) కోటా నుండి మోడీ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. నఖ్వీ రాజీనామా తర్వాత కేంద్రంలో ముస్లిం మంత్రి లేరనీ, బీజేపీకి ఉన్న 400 మంది ఎంపీల్లో ముస్లిం ఎంపీ లేరన్నారు.

ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ.. 26 మే 2014న నరేంద్ర మోదీ మంత్రివర్గంలో మైనారిటీ వ్యవహారాలు, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2016లో నజ్మా హెప్తుల్లా రాజీనామా చేసిన తర్వాత.. ఆయ‌న‌కు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. 2019లో నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణం చేసి మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో కొనసాగారు. ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల స‌మ‌యంలో ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ప‌దవీకాలం ముగియ‌డం.. కేంద్ర క్యాబినెట్(Modi Cabinet)లో ముస్లిం మంత్రులకు స్థానం లేక‌పోవ‌డంతో.. ముఖ్తార్ అబ్బాస్ న‌ఖ్వీని ఉప‌రాష్ట్ర‌ప‌తి రేసులో దించ‌నున్నారనే ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

మరోవైపు, ఆర్‌సీపీ సింగ్ రాజకీయాల్లోకి రాకముందు యూపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఏడాది క్రితం కేంద్ర ఉక్కు శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మోడీ కేబినెట్‌లో జేడీ(యూ) కోటా నుంచి మంత్రి అయ్యారు.