ముంబైలో ప్రముఖ మోడల్ దారుణహత్య.. హంతకుడు హైదరాబాదీ
ప్రముఖ మోడల్ దారుణ హత్యకు గురైన సంగతి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కలకలం రేపింది. రాజస్థాన్ కోటకు చెందిన మానసి దీక్షిత్ ముంబైలో మోడలింగ్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ప్రముఖ మోడల్ దారుణ హత్యకు గురైన సంగతి దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కలకలం రేపింది. రాజస్థాన్ కోటకు చెందిన మానసి దీక్షిత్ ముంబైలో మోడలింగ్ చేస్తూ.. మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈమె అంధేరిలోని మిల్లత్ నగర్లో ఓ ఫ్లాట్లో నివసిస్తోంది.
హైదరాబాద్కు చెందిన సయ్యద్ అనే యువకుడు కొద్దిరోజుల క్రితం బంధువులతో కలిసి ముంబైకి వచ్చాడు. ఈ క్రమంలో సయ్యద్కు సోషల్ మీడియాలో మానసి పరిచయమైంది. రోజు ఛాటింగ్ చేసుకుంటూ వీరద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది.
అలా సోమవారం సాయంత్రం సయ్యద్ ఉన్న అపార్ట్మెంట్కు మానసి వచ్చింది. కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. దీంతో ఆగ్రహంతో ఊగిపోతున్న సయ్యద్ స్టూల్తో బలంగా మానసిని కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది.
అనంతరం ఎవ్వరికి అనుమానం రాకుండా మానసి మృతదేహాన్ని సూట్కేసులో కుక్కి.. క్యాబ్లో మలాద్ ప్రాంతానికి తీసుకెళ్లి మైండ్స్పేస్ ఏరియాలో సూట్కేసును పడేశాడు. సయ్యద్ ప్రవర్తన విచిత్రంగా ఉండటంతో అనుమానించిన క్యాబ్ డ్రైవర్ పోలీసులకు సమాచారం అందించాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ సాయంతో సయ్యద్ను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు.