బాత్రూంలోకి తోసి తల్లిని చంపేసిన మోడల్
సునీతా సింగ్ తల వాష్ బేసిన్ కేసి కొట్టుకుంది. వెంటనే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. లక్ష్య సింగ్ బయటి నుంచి బాత్రూంను లాక్ చేశాడు. ఉదయం బాత్రూం తలుపులు తీసి చూసేసరికి తల్లి మరణించి పడి ఉంది.
ముంబై: ముంబైలో ఓ మోడల్ తన తల్లిని బాత్రూంలోకి తోసి చంపేశాడు. ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో అతను తల్లిని బాత్రూంలోకి తోశాడు. దీంతో ఆమె మరణించింది. శనివారంనాడు పోలీసులు ఈ విషయం చెప్పారు.
తన తల్లి సునీతా సింగ్ (45) మృతి కేసులో నిందితుడు లక్ష్య సింగ్ (23)ను అరెస్టు చేసినట్లు ఓషివారా పోలీసులు చెప్పారు. నిందితుడి ప్రియురాలితో పాటు వారిద్దరు ముంబైలోని లోఖండ్వాలా ప్రాంతంలో గల క్రాస్ గేట్ బిల్డింగులో అద్దెకు ఉంటున్నారు.
నిందితుడిని పోలీసులు శనివారం కోర్టులో ప్రవేశపెట్టారు. అతనికి కోర్టు అక్టోబర్ 8వ తేదీ వరకు రిమాండ్ విధించింది. తల్లీపుత్రులు డ్రగ్స్ కు అలవాటు పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
గొడవకు దారి తీసిన సంఘటన తనకు సరిగా గుర్తు లేదని నిందితుడు చెప్పాడు. బుధవారం రాత్రి డ్రగ్స్ తీసుకున్న తర్వాత డబ్బుల విషయమై ఇరువురికి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవలో తల్లిని అతను బాత్రూంలోకి తోసేశాడు.
సునీతా సింగ్ తల వాష్ బేసిన్ కేసి కొట్టుకుంది. వెంటనే ఆమె స్పృహ తప్పి పడిపోయింది. లక్ష్య సింగ్ బయటి నుంచి బాత్రూంను లాక్ చేశాడు. ఉదయం బాత్రూం తలుపులు తీసి చూసేసరికి తల్లి మరణించి పడి ఉంది. సంఘటన జరిగిన సమయంలో ఇద్దరు పని మనుషులు ఇంట్లో ఉన్నారు.