Manipur Violence | ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల హత్యను నిరసిస్తూ ఆందోళనకారులు ఇంఫాల్‌ నగరంతోపాటు పలు ఇతర ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగించారు.

Manipur Violence | మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడ్నెళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఇద్దరు విద్యార్థులను సాయుధ వ్యక్తులు కిడ్నాప్‌ చేసి, హత్య చేసిన విషయం తాజాగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ నివాసంపై అల్లరిమూక టార్గెట్ చేసింది. దాడికి ప్రయత్నించింది. ఈ ఘటన రాష్ట్ర రాజధాని ఇంఫాల్ లో జరిగింది. అయితే.. ఆ ఇంట్లో ఎవరూ నివసించరు. సిఎం కుటుంబం ఖాళీగా ఉన్న ఇంటిపై అల్లరి మూక దాడికి యత్నించిందని, అయితే భద్రతా బలగాలు గుంపును అడ్డుకున్నాయని పోలీసులు తెలిపారు.

మణిపూర్ సీఎం ఇంటిపై దాడికి యత్నం

ఇంఫాల్ తూర్పులోని హింగింగ్ ప్రాంతంలో నిరసనకారులు గుమిగూడారని, సీఎం ఎన్ బీరెన్ సింగ్ పూర్వీకుల ఇంటిని లక్ష్యంగా చేసుకునేందుకు గుంపు ప్రయత్నించిందని, అయితే..ఆ ప్రయత్నం విఫలమైందని పోలీసులు తెలిపారు. నివాసానికి వంద మీటర్ల ముందే అల్లరిమూకను అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు.

వీడియో వైరల్ కావడంతో మళ్లీ హింస

మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థుల మృతదేహాల వీడియో ఇంటర్నెట్ మీడియాలో వైరల్ అయిన తర్వాత.. హింసాత్మక ఘటనలు ప్రారంభమయ్యాయి. ఇంఫాల్ లోయలో మిలిటెంట్లు స్వేచ్ఛగా తిరుగుతూ ప్రజలను హింసకు ప్రేరేపించడం కనిపించింది. బుధవారం సాయంత్రం.. నల్ల దుస్తులు ధరించిన సాయుధులు ఆందోళన చెందిన యువకులను పోలీసులపై దాడికి మళ్లించడం కనిపించిందని అధికారులు తెలిపారు. అనంతరం పలు వాహనాలకు నిప్పు పెట్టారు.

యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ, ఇతర నిషేధిత సంస్థలకు చెందిన మిలిటెంట్లు గుంపులో భాగంగా ఏర్పడి భద్రతా దళాలపై దాడి చేస్తున్నారని భద్రతా సంస్థలు చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇది కాకుండా.. ఆసంస్థలు నిరసనకారులకు సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తోంది.

ఇదిలావుండగా.. ఉగ్రవాద కేసులను పరిష్కరించడంలో నైపుణ్యం కలిగిన శ్రీనగర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌ఎస్‌పి) రాకేష్ బల్వాల్‌ను కేంద్ర ప్రభుత్వం ముందస్తుగా ఆయన స్వస్థలమైన మణిపూర్ క్యాడర్‌కు బదిలీ చేసింది. 2012 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి బల్వాల్‌ మణిపూర్‌లో బాధ్యతలు చేపట్టాక ఆయనకు కొత్త పోస్టు ఇవ్వనున్నారు.