ప్రియుడితో లేచిపోవడం కోసం: కుటుంబానికి విషమిచ్చిన బాలిక
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తితో లేచిపోవాలని భావించిన ఓ బాలిక కుటుంబం మొత్తానికి విషం పెట్టింది
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ప్రేమించిన వ్యక్తితో లేచిపోవాలని భావించిన ఓ బాలిక కుటుంబం మొత్తానికి విషం పెట్టింది. వివరాల్లోకి వెళితే.. మొరాదాబాద్కు చెందిన ఓ మైనర్ బాలిక అర్వింద్ అనే యువకుడిని ప్రేమించింది.
అయితే తల్లిదండ్రులు తమ పెళ్లికి అంగీకరించరని భావించిన ఆమె.. తన ప్రియుడితో కలిసి పథకం వేసింది. దీనిలో భాగంగా కుటుంబసభ్యులు తినే ఆహారంలో విషం కలిపిపెట్టింది.
ఈ సంగతి తెలియని వారు... ఆ ఆహారం తినడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. తాను తప్పించుకోవడానికి ఇదే సరైన సమయమని భావించిన బాలిక ప్రియుడితో కలిసి లేచిపోయింది.
ఈ నేపథ్యంలో బయట పనిముగించుకుని ఇంటికొచ్చిన బాలిక తండ్రికి.. కుటుంబసభ్యులు అపస్మారక స్థితిలో పడివుండటాన్ని చూసి వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు వారిని ప్రాణాపాయం నుంచి కాపాడటంతో ఆయన ఊపిరి పీల్చుకున్నాడు.
అనంతరం తన కన్నబిడ్డే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టిందని తెలియడంతో ఆ తండ్రి కుమిలిపోయాడు. మరోవైపు అర్వింద్ అనే వ్యక్తి తన కుమార్తెపై అత్యాచారం చేసినట్లు ఆయన గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ కేసులో జైలుకు వెళ్లిన ఆ యువకుడు.. కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. ఇటీవలే బెయిల్పై బయటకొచ్చిన అతడు.. బాధితురాలి అన్నదమ్ములను చంపేస్తానని బెదిరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రేమ జంట కోసం గాలిస్తున్నారు.