అయోధ్యలో మసీదు నిర్మాణం... అక్కడ నమాజు కూడా పాపమే: ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
అయోధ్యలో నిర్మించే మసీదును అసలు మసీదనే పిలవొద్దంటూ.. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని బీదర్లో బుధవారం మాట్లాడిన అసద్.. అయోధ్యలో ప్రస్తుతం నిర్మిస్తోన్న మసీదులో ప్రార్థనలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
అయోధ్యలో నిర్మించే మసీదును అసలు మసీదనే పిలవొద్దంటూ.. ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని బీదర్లో బుధవారం మాట్లాడిన అసద్.. అయోధ్యలో ప్రస్తుతం నిర్మిస్తోన్న మసీదులో ప్రార్థనలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.
ఆ మసీదు నిర్మాణానికి విరాళాలు ఇవ్వడం ఇస్లాం ప్రకారం సరికాదని సూచించారు. బాబ్రీ మసీదును కూలగొట్టిన తర్వాత వివాదం తలెత్తగా.. సుదీర్ఘ కాలంపాటు విచారణ అనంతరం అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.
మసీదు నిర్మాణం కోసం ఐదెకరాల స్థలం కేటాయించాలని సర్వోన్నత న్యాయస్థానం ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాబ్రీ మసీదును కూలగొట్టిన తర్వాత కడుతున్న మసీదులో నమాజ్ చేయడం, దాని నిర్మాణం కోసం విరాళాలు ఇవ్వడం మంచిది కాదని హైదరాబాద్ ఎంపీ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మోడీని ఆరాధిస్తున్నారు.. అందరూ మోదీ భక్తులుగా మారారని ఒవైసీ ఎద్దేవా చేశారు. బీదర్ మున్సిపల్ ఎన్నికల ముందు ముస్లింలు, దళితులు ఐక్యంగా ఉండాలని ఎంఐఎం చీఫ్ పిలుపునిచ్చారు.
ముస్లింలు దళితులతో ఎప్పుడూ పోటీకి దిగొద్దన్న అసద్.. దళితులను కలుపుకొని పోవాలని సూచించారు. తాను అంబేద్కర్ అభిమానినన్న అసద్… గాడ్సే ఫ్యాన్స్ దేశంలో అల్లర్లు కూడా సృష్టించగలరన్నారు. దేశంలో శాంతి కోరుకునేవారిని యాంటీ నేషనల్స్ పేరుతో జైలుకు పంపిస్తున్నారని అసద్ ఆరోపించారు.
ధనవంతులు ఆ మసీదుకి డబ్బే ఇవ్వాలనుకుంటే నిరుపేద అమ్మాయిల వివాహానికి సాయపడాలని ఒవైసీ విజ్ఞప్తి చేశారు. నిస్సహాయులకు దానమివ్వాలని... అలాంటివారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. అంతేగానీ ఆ మసీదుకు మాత్రం నయాపైసా ఇవ్వొద్దు అంటూ అసదుద్దీన్ సంచలన కామెంట్స్ చేశారు.