కన్నతండ్రే కాల యముడయ్యాడు.. ఇద్దరు కుమార్తెలను గొడ్డలితో నరికి హత్య.. అడ్డొచ్చిన భార్య,మనవడిపై..
రాజస్థాన్ లోని నాగౌర్లో ఓ తండ్రి రాక్షసుడిగా మారాడు. మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి ఇద్దరు కుమార్తెలను గొడ్డలితో నరికి హత్య చేశారు. అడ్డొచ్చిన భార్య, మనవడిని తీవ్రంగా గాయపరిచాడు.
రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాలో హృదయ విదారకమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. పర్బత్సర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిల్ధాని గ్రామంలో ఓ వ్యక్తి తన భార్య, ఇద్దరు కుమార్తెలు, మనవడిపై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కుమార్తెలు అక్కడికక్కడే మృతి చెందగా, భార్య, మనవడి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చిక్సిత కోసం జిల్లా ఆసుపత్రిలో తరలించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.
స్థానికుల సమాచారం మేరకు కూచమన్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ గణేష్ రామ్ చౌదరితో పాటు పర్బత్సర్ పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సోమవారం అర్థరాత్రి ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు తెలిపారు. దిల్ధాని నివాసి మనారామ్ ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడు నిద్రిస్తున్న తన భార్య, మనవడు, కుమార్తెలిద్దరిపై గొడ్డలితో దాడి చేశాడు. ఘటన అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారు అయినట్టు పోలీసులు గుర్తించారు. కుమార్తెలిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
స్థానికుల సమాచారంతో పర్బత్ సర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన భార్య, మనవడిని పోలీసులు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ నుండి వారిద్దరిని అజ్మీర్కు రెఫర్ చేశారు. సంఘటన సమయంలో కుమార్తెలిద్దరూ కూడా నిందితుడైన తండ్రితో పోరాడారని, కానీ.. ప్రాణాలకు కాపాడుకోలేకపోయారని పోలీసులు చెప్పారు.
కుమార్తెలిద్దరికీ అప్పటికే వివాహమైనట్లు విచారణలో తేలింది. కుమార్తెలిద్దరూ రెండు రోజుల క్రితమే తల్లి ఇంటికి వచ్చారు. వీరిలో ఒక కుమార్తె మంగళవారం తిరిగి తన అత్తమామల ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. మనారామ్ గత ఐదేళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిసిందని అదనపు పోలీసు సూపరింటెండెంట్ గణేష్ రామ్ చౌదరి తెలిపారు. దీంతో అతడు గత రాత్రి ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. మనారామ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.