తెలుగు ఐఏఎస్ రోహిణి సింధూరిపై ఆరోపణలు: బదిలీ చేయాలంటూ మైసూరు కౌన్సిల్ పట్టు
కర్ణాటకలో ఐఏఎస్ ఉద్యోగుల మధ్య విభేదాలు రచ్చెకెక్కాయి. ఇందులో ఒకరు మన తెలుగు అధికారి రోహిణి సింధూరి కావడం గమనార్హం.
డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి తమను వేధిస్తున్నారంటూ మైసూరు సిటీ కార్పొరేషన్ (ఎంసిసి) కమిషనర్ శిల్ప నాగ్ మీడియా ఎదుటే ఆరోపించారు
కర్ణాటకలో ఐఏఎస్ ఉద్యోగుల మధ్య విభేదాలు రచ్చెకెక్కాయి. ఇందులో ఒకరు మన తెలుగు అధికారి రోహిణి సింధూరి కావడం గమనార్హం. డిప్యూటీ కమిషనర్ రోహిణి సింధూరి తమను వేధిస్తున్నారంటూ మైసూరు సిటీ కార్పొరేషన్ (ఎంసిసి) కమిషనర్ శిల్ప నాగ్ మీడియా ఎదుటే ఆరోపించారు. అదే సమావేశంలో తన రాజీనామా ప్రకటించడం కలకలం రేపింది. అలాగే కరోనా కట్టడికి సంబంధించి పరిపాలనా యంత్రాంగంలో ఉన్న గందరగోళం, లోపాలను ఎత్తిచూపారు.
రాష్ట్రంలో బెంగళూరు తర్వాత కరోనా కేసులు ఎక్కువగా వున్న జిల్లా మైసూరే. తాను మైసూర్ నగరపాలక సంస్థ కమీషనర్ పదవి నుంచి తప్పుకోవడం లేదని.. కానీ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)కు రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తనను విధుల నుంచి రిలీవ్ చేయాలని కోరుతూ సీఎస్కు లేఖ రాస్తానని శిల్పా నాగ్ చెప్పారు. తన రాజీనామాను ఆమోదించి ఈ బాధ నుంచి విముక్తి చేయాలంటూ శిల్పా నాగ్ స్వయంగా లేఖ రాశారు.
ఇదిలావుండగా, నగరంలో జరుగుతున్న పరిణామాల గురించి చీఫ్ సెక్రటరీ రవి కుమార్కు తెలియజేసినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ విషయాన్ని తేల్చడానికి ఆయన శుక్రవారం మైసూరుకు వెళ్లనున్నారు. డిప్యూటీ కమిషనర్ నిరంతరం ఉన్నత స్థాయి సమావేశానికి పిలిచి, ఎంసీసీలో ఏమీ చేయడం లేదని తమపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారని శిల్పా నాగ్ ఆరోపించారు.
ఆమెకు (సింధూరి) తనపై వ్యక్తిగత పగ ఉంటే ఆమె దానిని తనపై తీర్చుకోవాలని కాని మహమ్మారిని ఎదుర్కోవటానికి నిరంతరాయంగా పనిచేస్తున్న అధికారులను ఎందుకు లక్ష్యంగా చేసుకోవాలి శిల్పా ప్రశ్నించారు. అలాంటి అహంకారాన్ని ఏ వ్యక్తి కూడా కలిగి వుండకూడదని.. ఇక్కడ పనిచేయడం చాలా ఇబ్బందిగా వుందుని ఆమె వ్యాఖ్యానించారు.
దీనిపై సింధూరిని మీడియా సంప్రదించగా.. ఆమె వాటిని ఖండించారు. శిల్పా చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం, నిరాధారమైనవి స్పష్టం చేశారు. ఎంసీసీ వెల్లడిస్తున్న కరోనా కేసుల సంఖ్యకి.. వార్ రూమ్ నెంబర్లకు పొంతన వుండటం లేదన్నారు. మైసూరులో.. తాలూకాల కంటే ఎక్కువ కరోనా కేసులు ఉన్నాయని ఆమె అన్నారు. అయితే డిసిగా తనకు నగరం, తాలూకాలు రెండూ సమానమేనని స్పష్టం చేశారు.
మరోవైపు మైసూర్ సిటీ కార్పొరేషన్లోని మొత్తం 65 మంది సభ్యులు కమిషనర్ శిల్పా నాగ్కు అండగా నిలబడ్డారు. ఆమె నిజాయితీగల అధికారిని అని చెప్పారు. ఇదే సమయంలో డీసీ రోహిణి సింధూరిని వెంటనే బదిలీ చేయాలని వారు డిమాండ్ చేశారు. సింధూరిపై చర్యలు తీసుకోనిపక్షంలో.. కరోనాకు సంబంధించిన అన్ని పనులు రేపటి నుండి ఆగిపోతాయని వారు హెచ్చరించారు.