నమీబియా నుంచి వచ్చిన చిరుతలను మీరు నేరుగా ఎప్పుడు చూడొచ్చొ తెలుసా?.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
Mann Ki Baat: దేశంలో ఇదివరకు అంతరించిపోయిన చిరుతలను మళ్లీ ఆఫ్రికా దేశాల నుంచి భారత్కు తిరిగి తీసుకురావడం పట్ల దేశం నలుమూలల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారని ప్రధాని మోడీ అన్నారు. ప్రస్తుతం ఆ చితాలు మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్కులో ఉన్నాయి.
Cheetahs: దేశంలో గతంలో అంతరించిపోయిన జాతికి చెందిన చిరుతలను ప్రభుత్వం ఆఫ్రికా దేశాల నుంచి భారత్ కు తీసుకువచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ తన పుట్టిన రోజు సందర్భంగా వాటిని మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్కు లోకి విడుదల చేశారు. అయితే, ఈ చిరుతలను నేరుగా ప్రజలు చూడటానికి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనే ప్రశ్నలపై ప్రధాని మోడీ స్పందించారు. ప్రధాని మోడీ ఆదివారం నాడు తన నెలవారీ రేడియో కార్యక్రమమైన మన్ కీ బాత్ లో ఆఫ్రికా దేశాల నుంచి తీసుకువచ్చిన ఎనిమిది చిరుత గురించి కూడా ప్రస్తావించారు. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో విడుదల చేసిన ఎనిమిది చిరుతలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన టాస్క్ఫోర్స్, పార్కును ప్రజలకు ఎప్పుడు తెరవాలో సిఫారసు చేస్తుందని ప్రధాని అన్నారు. ప్యానెల్ సిఫార్సు ఆధారంగా నమీబియా నుండి తీసుకువచ్చిన జంతువులను ప్రజలు ఎప్పుడు చూడగలుగుతారో ప్రభుత్వం ప్రకటిస్తుందని ప్రధాని చెప్పారు.
దేశంలో అంతరించిపోయిన చిరుతలను నమీబియా ప్రాంతాల నుంచి తీసుకురావడం గురించి ప్రధాని మోడీ మాట్లాడుతూ.. "చాలా ఉత్సాహంగా ఉంది.. 1.3 బిలియన్ల భారతీయులు ఉప్పొంగిపోయారు.. ఇది ప్రకృతి పట్ల భారతదేశానికి ఉన్న ప్రేమ అని గర్వంతో నిండిపోయింది" అని ప్రధాని అన్నారు. అలాగే, “చిరుతలను చూసే అవకాశం ఎప్పుడు లభిస్తుందని చాలా మంది నన్ను అడిగారు... చిరుతలను పర్యవేక్షించేందుకు ఒక టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేశారు. జంతువులు కొత్త వాతావరణానికి ఎలా అనుగుణంగా ఉంటున్నాయా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయనే విషయాలను వారు గమనిస్తుంటారు. ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడ్డ తర్వాత.. టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది” అని ప్రధాని మోడీ చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ తన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న నమీబియా ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన ఎనిమిది చిరుతలను మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్కులో విడిచారు.
1952లో దేశంలో అంతరించిపోయినట్లు ప్రకటించబడిన తర్వాత ఎనిమిది చిరుతలను నమీబియా నుండి ఖండాంతర ట్రాన్స్లోకేషన్ ప్రాజెక్ట్లో భాగంగా సెప్టెంబర్ 17న నమీబియా ప్రాంతాల నుంచి భారత్ కు తీసుకువచ్చారు.ఈ ఎనిమిది చిరుతల్లో ఐదు ఆడవి, మూడు మగవి ఉన్నాయి.
చిరుతలకు పేర్లు పెట్టే పోటీ..
ప్రధాని తన 93వ మన్ కీ బాత్ ఎడిషన్ సందర్భంగా ఈ చిరుతల ప్రాజెక్టు తో పాటు అక్కడున్న జంతువులకు పేర్లు పెట్డానికి ఒక పోటీని ప్రారంభించనున్నట్లు తెలిపారు. "MyGov ప్లాట్ఫారమ్లో ఒక పోటీ నిర్వహించబడుతుంది.. దీనికి సంబంధించి కొన్ని విషయాలను పంచుకోవాలని నేను ప్రజలను కోరుతున్నాను... మనం చిరుతలపై నడుపుతున్న ప్రచారానికి ఏ పేరు పెట్టాలి... ఈ చిరుతలన్నింటికీ పేరు పెట్టడం గురించి మనందరి నుంచి సూచనలు తీసుకోవాలి.. " అని ఆయన అన్నారు. ఈ పోటీలో పాల్గొనే వారు పేర్ల విషయంలో ప్రధాని కొన్ని సూచనలు కూడా చేశారు. పేర్లు సంప్రదాయంగా, భారతీయ సంస్కృతికి, వారసత్వానికి అనుగుణంగా ఉండాలని సూచించారు.
“మనుషులు జంతువులతో ఎలా ప్రవర్తించాలో కూడా మీరు సూచించవచ్చు. మన ప్రాథమిక విధులు జంతువుల పట్ల గౌరవాన్ని కూడా నొక్కి చెబుతాయి. ఈ పోటీలో పాల్గొనవలసిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను.. ఇందులో విజయం సాధిస్తే.. మీరు చిరుతలను చూసే మొదటి వ్యక్తి కావచ్చు”అని ప్రధాని మోడీ అన్నారు.