26 ఏళ్లలో 21 పెళ్లిళ్లు:తమిళనాడులో నిత్య పెళ్లికొడుకు అరె'స్ట్
తమిళనాడు రాష్ట్రంలో నిత్య పెళ్లికొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు. 26 ఏళ్ల వయస్సున్న కార్తీక్ రాజా 21 పెళ్లిళ్లు చేసుకున్నాడు. కార్తీక్ రాజాను పోలీసులు విచారిస్తున్నారు. .
చెన్నై: 26 ఏళ్ల వయస్సుకే 21 పెళ్లిళ్లు చేసుకున్న నిత్య పెళ్లి కొడుకును తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కార్తీక్ రాజాను పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు జిల్లాలోని రామనపూడికి చెందిన కార్తీక్ రాజా 21 పెళ్లిళ్లు చేసుకున్నాడు.ఈ ఏడాది మార్చి మాసంలో రాణి అనే యువతిని ఆయన 21వ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొంత కాలానికి భార్య వద్ద ఉన్న ఐదు తులాల బంగారం, లక్షన్నర నగదును ఆయన తీసుకొని పారిపోయాడు. భర్త ఆచూకీ కోసం భార్య రాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కార్తీక్ రాజా ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. ఆయనను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే 21 పెళ్లిళ్లు జరిగిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. రెండు రోజులుగా కార్తీక్ రాజాను 21 పెళ్లిళ్లు ఎలా చేసుకున్నారనే విషయమై ఆరా తీస్తున్నారు. కార్తీక్ రాజాకు ఎవరూ లేరు.
పలు రకాల ఉద్యోగాలు చేస్తున్నానని నమ్మించి కార్తీక్ రాజా పెళ్లిళ్లు చేసుకున్నారు. ఒక్కో అమ్మాయిని వివాహం చేసుకొనే సమయంలో ఒక్కో పేరుతో పరిచయం చేసుకున్నాడు. విలాసవంతమైన జీవితాన్ని కార్తీక్ రాజా గడిపేవాడు. ఒక్కో భార్యతో ఐదారు మాసాల కంటే ఎక్కువగా ఆయన కాపురం చేయలేదు. మరో పెళ్లికి మరో ప్రాంతానికి వెళ్లి అక్కడి యువతిని వివాహం చేసుకొనేవాడని పోలీసులు గుర్తించారు. కార్తీక్ రాజా వయస్సు 26 ఏళ్లు. అయితే ఆయన ఇప్పటికే 21 పెళ్లిళ్లు చేసుకున్నాడు. కార్తీక్ రాజా కోసం అతని భార్యలు తమిళనాడు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిత్య పెళ్లి కొడుకు కార్తీక్ రాజా వద్ద ఆడి కారు మినహా నగదు, బంగారం లేదని పోలీసులు గుర్తించారు. నగదు, బంగారం గురించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు