హత్య చేసి.. శవంతో సెల్ఫీ
గంజాయి మత్తులో ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది.
గంజాయి మత్తులో ఓ యువకుడు చేసిన పని ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. గంజాయి మత్తులో ఓ యువకుడిని హత్య చేసి.. ఆ శవంతో సెల్ఫీ దిగాడు. అంతటితో ఆగకుండా ఆ ఫోటోని వాట్సాప్ లో అందరికీ షేర్ చేశాడు. ఈ సంఘటన చెన్నైలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. చెన్నై పరంగిమలై ఆదంబాక్కం పోలీసు స్టేషన్ వెనుకవైపు రెండు రోజుల క్రితం ముగ్గురు యువకులు గంజాయి సేవించేందుకు అక్కడికి వెళ్లారు. కొద్ది సేపటికి బయటకు ఇద్దరు వ్యక్తులే వెళ్లడం స్థానికులు గమనించి అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడి సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను పరిశీలించి, తనిఖీ చేయగా ఓ చోట మట్టి తవ్వి ఉండడాన్ని గమనించారు.
ఆ మట్టిని తొలగించి చూడగా ఒక యువకుని శవం తీవ్ర గాయాలతో, ముఖం చిద్రమైన స్థితిలో ఉంది. శవాన్ని పంచనామా చేసి, విచారణ చేపట్టారు. ముగ్గురు స్నేహితులు గంజాయి తీసుకున్నారు. ఆ సమయంలో చిన్న గొడవ జరగగా.. ఆనంద్ అనే వ్యక్తి తన స్నేహితుడిని దారుణంగా హత్య చేశాడు. అనంతరం శవంతో సెల్ఫీ దిగి వాట్సాప్ లో షేర్ చేశాడు.
ఆ ఫోటో ఆదారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. హత్య చేసిన వ్యక్తి, అతనికి సహకరించిన వ్యక్తి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.