Asianet News TeluguAsianet News Telugu

Mamata Banerjee: ‘కాంగ్రెస్ అలా చేసినప్పుడు.. టీఎంసీ గోవాలో ఎందుకు పోటీ చేయకూడదు?’.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

కాంగ్రెస్, బీజపీలపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) బుధవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.  తాను భారత రాజకీయాలను బీజేపీ (BJP) రహితంగా చూడాలని అనుకుంటున్నట్టు చెప్పారు.

mamata banerjee fires on congress and bjp in her mumbai visit
Author
Mumbai, First Published Dec 1, 2021, 3:21 PM IST

కాంగ్రెస్, బీజపీలపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) బుధవారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తాను భారత రాజకీయాలను బీజేపీ రహితంగా చూడాలని అనుకుంటున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ముంబై పర్యటనలో ఉన్న మమతా బెనర్జీ సివిల్ సొసైటీ సభ్యులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో కాంగ్రెస్ పోటీ చేస్తే.. గోవాలో తాను ఎందుకు పోటీ చేయకూడదని ప్రశ్నించారు. క్షేత్ర స్థాయిలో ఉండి పోరాడటం ముఖ్యమని చెప్పిన మమతా బెనర్జీ.. లేకపోతే వాళ్లు ఒడిస్తారని అన్నారు. 

అయితే బెంగాల్‌ బయట కూడా తమ పార్టీని విస్తరించాలని మమతా బెనర్జీ చేస్తున్న ప్రయత్నాలకు త్రిపుర మున్సిపల్ ఎన్నికల్లో (Tripura civic body polls) గట్టి షాక్ తగిలింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీఎంసీ తీవ్రంగా శ్రమించింది. కానీ ఫలితం లేకుండా పోయింది. అక్కడ బీజేపీ ఘన విజయం సాధించడంతో.. తృణమూల్ విస్తరణ ప్రణాళికలపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమె కాంగ్రెస్‌, బీజేపీలై విరుచుకుపడినట్టుగా తెలుస్తోంది.

‘అన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి ఉంటే బీజేపీని ఓడించడం చాలా సులభ. రాష్ట్రంలో పరిస్థితులు బాగానే ఉన్నప్పటికీ నేను బెంగాల్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.. ఇలాగే ఇతరులు కూడా బయటకు వస్తే బీజేపీకి గట్టి పోటీ ఉంటుంది’ అని మమతా బెనర్జీ అన్నారు. 

Also read: షారూఖ్ ఖాన్‌ను బలిపశువు చేశారు.. మహారాష్ట్రలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలనం

కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు, వ్యవసాయ చట్టాలను రద్ద చేయడంపై స్పందించిన తృణమూల్ అధినేత్రి.. వాటిని ఎన్నికల స్టంట్‌గా అభివర్ణించారు. ‘ ఎన్నికల సమయం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీ భయపడి.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించారు. అయితే ఎన్నికలు లేకుంటే మాత్రం వాటిని పెంచుకుంటూ పోతారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే వ్యవసాయ చట్టాలను రద్దు చేశారు’ అని ఆమె అన్నారు. రాజకీయ నాయకులు మాట్లాడమే కాకుండా.. అలాగే నడుచుకోవాలని మమతా బెనర్జీ అన్నారు. తాను మాత్రం తక్కువ మాట్లాడి.. ఎక్కువగా నడుస్తానని చమత్కరించారు. 

చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మమతా బెనర్జీ.. ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వ వ్యతిరేకులను వేధించడానికి ప్రభుత్వం దీనిని ఉపయోగిస్తుందని ఆరోపించారు. అసమ్మతిని అణచివేసేందుకు పాలకపక్షం ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తుందని మండిపడ్డారు. తనకు ఏ సంస్థలపైన వ్యక్తిగత ద్వేషం లేదని.. కానీ వాటిని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ దిగిపోయి.. తాము అధికారంలో ఉంటే ప్రజలకు వ్యతిరేకంగా ఎలాంటి చట్టం రాదని హామీ ఇస్తున్నట్టుగా చెప్పారు. 

ప్రస్తుతం మహారాష్ట్ర పర్యటనలో ఉన్న మమతా బెనర్జీ.. అక్కడ ఇతర ప్రతిపక్ష పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం శివసేన నేతలు ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్‌లతో మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఈరోజు సాయంత్రం ఆమె ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో (Sharad Pawar) సమావేశం కానున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios