బాత్రూం గ్రిల్స్ తొలగించి.. రూ.47 లక్షల విలువైన నగలు చోరీ...భర్తతో కలిసి ఇంటి పనిమనిషి దారుణం..
యజమాని ఇంట్లో లేని సమయంలో భర్తతో కలిసి దొంగతనానికి పాల్పడిందో పనిమనిషి. పక్కా ప్లాన్ తో బాత్రూం కిటికీ గ్రిల్స్ తొలగించి ఇంట్లోకి దూరింది. 47 లక్షల విలువైన నగలు చోరీ చేసింది.
ముంబై : నమ్మి ఇంట్లో పని కల్పిస్తే.. భర్తతో కలిసి తిన్నింటి వాసాలు లెక్కపెట్టిందో పనిమనిషి. యజమాని ఇంటికే కన్నం వేసింది. దీనికోసం బాత్ రూం కిటికీ గ్రిల్స్ తీసి ఇంట్లోకి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు రూ.47లక్షలు విలువైన నగలు ఎత్తుకెళ్లింది. ఇందులో బంగారం, వెండి, నాణేలు, వజ్రాభరణాలు ఉన్నాయి. డిసెంబర్ 26-27 మధ్య తేదీల్లో మహారాష్ట్ర పూణెలోని కల్యాణి నగర్ కుమార్ సిటీలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
ఇంటి యజమాని సూరజ్ అగర్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా పనిమనిషి ఊర్మిల హర్గే, ఆమె భర్త రాజ్ పాల్ హర్గెను అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో వారు చేసిన నేరాన్ని అంగీకరించారు.
దీంతో వారినుంచి రూ.27 లక్షల విలువచేసే నగలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు వివరాలు తెలియజేశారు. మిగతా రూ.20 లక్షలకోసం పనిమనిషి ఊర్మిల హర్గేను ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. దొంగతనం జరిగిన సమయంలో యజమాని సూరజ్ అగర్వాల్ ఇంట్లో లేడు. ఆయన కుటుంబంతో కలిసి వేరే దగ్గరికి వెళ్లాడు. క్రిస్మస్ సందర్భంగా వేడుకల కోసం అలీబాగ్ కు వెళ్లారు. ఈ విషయాన్ని గమనించిన పనిమనిషి భర్తతో కలిసి.. దొంగతనానికి సాహసించింది. చివరికి పట్టుబడి జైలుపాలయ్యింది.