మహారాష్ట్రలో మరోసారి  రాజకీయం రసవత్తరంగా మారుతున్నది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో శివసేన ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి ఆ తర్వాత పార్టీ కాంటాక్టులో లేకుండా పోయారు. సోమవారం సాయంత్రం వారు అందుబాటులో లేకుండా పోయారు. సుమారు 22 మంది ఎమ్మెల్యేలు మంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో బీజేపీ పాలిత గుజరాత్‌లోని సూరత్‌లో ఓ హోటల్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ పరిణామాలు రాష్ట్రంలో ప్రభుత్వం మారే సంకేతాలను సూచిస్తున్నాయనే చర్చ మొదలైంది.

ముంబయి: మహారాష్ట్ర రాజకీయం మరోసారి రాజుకుంది. రాష్ట్ర ప్రభుత్వమే సంక్షోభంలో పడిన సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ 22 మంది రెబల్ ఎమ్మెల్యేలు ప్రతిపక్ష పార్టీ బీజేపీ పాలిత గుజరాత్‌లో మకాం వేశారు. కాగా, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తమ బాస్ అమిత్ షాతో మంతనాలు జరపడానికి ఢిల్లీ వెళ్లారు. ఇవన్నీ మహారాష్ట్రలో పెద్ద మార్పుకే సంకేతాలు ఇస్తున్నాయి. ఇదిలా ఉండగా అధికార పార్టీ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మాత్రం.. తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని, ప్రభుత్వాన్ని కూల్చే బీజేపీ కుట్ర సఫలం కాదని అంటున్నారు. శివసేన ఎమ్మెల్యేలు అందరూ విశ్వసనీయులు అని, పరిస్థితులు తమ అదుపులోనే ఉన్నాయని చెబుతున్నారు.

ఎమ్మెల్సీ ఫలితాల తర్వాత కొంత మంది శివసేన ఎమ్మెల్యేలు పార్టీ అధినాయకత్వానికి అందుబాటులో లేకుండా పోయారని తెలిసింది. ముఖ్యంగా థానేలో మాస్ లీడర్‌గా ఉన్న ప్రస్తుత రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే పార్టీ నాయకత్వానికి సవాల్ విసిరినట్టు సమాచారం. సోమవారం రాత్రి ఏక్‌నాథ్ షిండే తనతోపాటు 21 మంది శివసేన ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని బీజేపీ పాలిత గుజరాత్‌కు వెళ్లారని మీడియా వర్గాలు చెబుతున్నాయి. సూరత్‌లోని ఓ హోటల్‌లో మకాం వేసినట్టు తెలుస్తున్నది. వారికి గుజరాత్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కల్పించినట్టు కథనాలు వచ్చాయి. అంతేకాదు, ఈ శివసేన ఎమ్మెల్యేలు అక్కడి బీజేపీ నేతలకు టచ్‌లో ఉన్నారని తెలిసింది.

ఏక్‌నాథ్ షిండే ముంబయిలో లేరని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా ధ్రువీకరించారు. కానీ, వారిని తాము సంప్రదించగలిగామని వివరించారు. ఏక్‌నాథ్ షిండేను ఉపయోగించి తమ ప్రభుత్వాన్ని కూల్చాలనే ప్రయత్నాలు సఫలం కావని అన్నారు. షిండే తమ పార్టీకి విశ్వసనీయమైన నేత అని వివరించారు. తమతోపాటు చాలా ఆందోళనల్లో ఆయన పాలుపంచుకున్నారని వివరించారు. ఆయన బాలాసాహెబ్ సైనికుడు అని చెప్పారు. శివసేన పార్టీనే విశ్వసనీయుల పార్టీ అని అన్నారు. శివసేన నేతలు అధికార లాలసకు పడిపోరని చెప్పారు. అసలు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలే కన్ఫ్యూజన్‌లో ఉన్నారని పేర్కొన్నారు. వారు తిరిగి రాకుండా బీజేపీ అడ్డుకుంటున్నదని అన్నారు. ఇది నిర్బంధం అని, బీజేపీ.. శివసేన ప్రభుత్వాన్ని బలహీనం చేయాలని ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. సోమవారం రాత్రి తమ ఎమ్మెల్యేలు కాంటాక్టులో లేరన్నది నిజమేనని, కానీ, ఇప్పుడు వారిలో చాలా మందిని తాము సంప్రదించగలిగామని వివరించారు.

మహారాష్ట్రలో అధికార కూటమి మహా వికాస్ అఘాదీలో పొరపొచ్చాలు వచ్చి ఐక్యత సన్నగిల్లినట్టు రాజ్యసభ ఎన్నికల ఫలితాలతో చాలా మంది అనుమానాలు వచ్చాయి. బీజేపీ అనుకున్నదాని కన్నా ఎక్కువ సీట్లు రాబట్టగలిగింది. శివసేనకే ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ తర్వాత తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ శివసేన భంగపడింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటంతో 10 స్థానాల్లో ఐదింటిని బీజేపీ సునాయసంగా గెలుచుకుంది. కాగా, ఎప్పుడూ ఊహకు అందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌పై ప్రశంసలు కురిపించారు. ఫడ్నవీస్ అద్భుతం సృష్టించారని అన్నారు. ఈ ప్రశంస ఫడ్నవీస్ శ్రమను కొనియాడేదా? లేక మహా వికాస్ అఘాదీ కూటమిపై వ్యతిరేకతనా? అనే చర్చ జరిగింది.