మహారాష్ట్రకు జూలై, ఆగష్టుల్లో కరోనా మూడో వేవ్ భయం: మంత్రి రాజేష్
రాష్ట్రంలో ఈ ఏడాది జూలై, ఆగష్టు మాసాల్లో కరోనా మూడో వేవ్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే చెప్పారు.
ముంబై: రాష్ట్రంలో ఈ ఏడాది జూలై, ఆగష్టు మాసాల్లో కరోనా మూడో వేవ్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే చెప్పారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో 66, 159 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులోనే 771 మంది మరణించారు. రాష్ట్ర ప్రజలకు సరిపడు ఆక్సిజన్ నిల్వలున్నాయని ఆయన తెలిపారు.
మే చివరి నాటికి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తీవ్రంగా ఉందని చెప్పారు. జూలై లేదా ఆగస్టు మాసంలో కరోనా మూడో వేవ్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్య శాఖ అధికారులు నిపుణులు చెబుతున్నారు. సీఎం ఉద్దవ్ ఠాక్రేతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు.
జూలై, ఆగష్టు మాసాల్లో రోగులకు అవసరమైన ఆక్సిజన్ ను అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు. కలెక్టర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన ఈ విషయమై స్పష్టం చేశారు.దేశంలోని మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదౌతున్నాయి. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు రికార్డు అవుతున్నాయి.