టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మృతిపై సమగ్ర విచారణకు మహారాష్ట్ర సర్కారు ఆదేశం
టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ : ఆదివారం మధ్యాహ్నం 3.15 గంటల ప్రాంతంలో మిస్త్రీ అహ్మదాబాద్ నుంచి ముంబైకి మెర్సిడెస్ కారులో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సర్కారు విచారణకు ఆదేశించింది.
న్యూఢిల్లీ: టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ ఆదివారం నాడు మృతి చెందిన రోడ్డు ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని హోం శాఖను నిర్వహిస్తున్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ రాష్ట్ర పోలీసులను ఆదేశించినట్లు పీటీఐ నివేదించింది. ముంబయికి ఆనుకుని ఉన్న పాల్ఘర్ సమీపంలో జరిగిన దురదృష్టకర ప్రమాదంలో మిస్త్రీ (54) మరణించిన విషయం తెలిసి తాను షాక్ అయ్యాననీ, చాలా బాధపడ్డానని ఫడ్నవీస్ అన్నారు. తన ట్విట్టర్ హ్యాండిల్లో ఫడ్నవీస్.. "డీజీపీతో మాట్లాడాను.. ఈ ఘటనపై వివరణాత్మక దర్యాప్తు కోసం ఆదేశించాను" అని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు, మిత్రులకు, సహోద్యోగులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చెప్పారు.
ముంబయి సమీపంలోని పాల్ఘర్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టాటా గ్రూప్ మాజీ చైర్మన్, పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ మరణించడం గమనార్హం. ప్రమాదం తర్వాత, మిస్త్రీని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆయన చనిపోయినట్లు ప్రకటించారు. కారు డ్రైవర్తో సహా అతనితో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారు గుజరాత్లోని ఇక ఆసుపత్రి లో ప్రాణాలతో పోరాడుతున్నారని సమాచారం.
పీటీఐ కథనం ప్రకారం.. టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ మెర్సిడెస్ కారులో అహ్మదాబాద్ నుండి ముంబయికి వెళుతుండగా మధ్యాహ్నం 3.15 గంటలకు ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మిస్త్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాసా గ్రామీణ ఆసుపత్రికి తరలించారు. మిస్త్రీ మృతి ప్రపంచ వాణిజ్య, పారిశ్రామిక రంగానికి తీరని లోటు అని ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. "శ్రీ సైరస్ మిస్త్రీ అకాల మరణం దిగ్భ్రాంతికరం. ఆయన భారతదేశ ఆర్థిక పరాక్రమాన్ని విశ్వసించిన మంచి వ్యాపారవేత్త. ఆయన మరణం వాణిజ్య, పారిశ్రామిక ప్రపంచానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను’’ అని ఆయన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.
కాగా, మిస్త్రీ కుటుంబసభ్యులు, స్నేహితులకు నివాళులర్పిస్తూ సోషల్ మీడియా మెసేజ్లు వెల్లువెత్తాయి. ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రముఖులు వ్యాపారవేత్త మృతికి సంతాపం తెలిపారు.