అయితే తమ పాఠశాలలో అలాంటి మతమార్పిడి ఘటనలు జరగలేదని, ఏ విద్యార్థిపైనా ఒత్తిడి చేయలేదని స్కూల్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది యాజమాన్యం.
తంజావూరు విద్యార్థి ఆత్మహత్య కేసు విషయంలో మద్రాస్ హైకోర్టు షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ కేసును.. సీబీఐ చేతికి అప్పగించింది. విద్యార్థిని చదువుతున్న పాఠశాలలో బలవంతంగా మతమార్పిడికి యత్నించడం వల్లే ఆ ఒత్తిడికి తమ కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు విద్యార్థిని తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే తమ పాఠశాలలో అలాంటి మతమార్పిడి ఘటనలు జరగలేదని, ఏ విద్యార్థిపైనా ఒత్తిడి చేయలేదని స్కూల్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది యాజమాన్యం.
ఈ కేసు పూర్తి వివరాల్లోకి వెళితే..అరియాలూర్ జిల్లా వదుగపలయమ్ కీజా ప్రాంతానికి చెందిన విద్యార్థిని.. సేక్రెడ్ హార్ట్ స్కూల్లో 12వ తరగతి చదువుతోంది. స్థానికంగా ఉన్న సెయింట్ మైఖేల్ గర్ల్స్ హాస్టల్లో ఉంటోంది. ఆ విద్యార్థిని జనవరి 15న విషం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జనవరి 19న మృతిచెందింది. మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు.. పాఠశాలలో బలవంతంగా మతమార్పిడి చేసేందుకు ఒత్తిడి తీసుకురావడం వల్లనే ఆమె మృతిచెందినట్లు ఆరోపిస్తున్నారు. ఈ కేసునే ఇప్పుడు సీబీఐ కి అప్పగించడం గమనార్హం.
