Madhya Pradesh: ఓ దళిత బాలిక బడికి పోతున్నదని బాలికతో పాటు ఆమె కుటుంబంపై అగ్ర వర్ణాలకు చెందిన వ్యక్తులు దాడిచేశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
Dalit girl family: కాలంతో పోటీపడుతూ మనిషి చంద్రునిపై కాలనీలు నిర్మించుకునే స్థాయిలో చేరుతున్నప్పటికీ.. ఇంకా దేశంలోని పలు చోట్ల కులాల పేరుతో కొట్టుకోవడం, దళితులపై దాడులు చేయడం, వెలి వంటి దారుణాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ తరహాలోనే ఓ దళిత బాలిక చదువుకోవడానికి పాఠశాలకు పోతున్నదని ఆగ్రహించిన అగ్రవర్ణాల సభ్యులు బాలికపై దాడి చేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులను సైతం కొట్టారు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. మధ్యప్రదేశ్లోని షాజాపూర్ జిల్లాలోని ఒక గ్రామంలో 16 ఏళ్ల దళిత బాలికను తమ ఆదేశాలకు వ్యతిరేకంగా పాఠశాలకు పంపారనే ఆరోపణతో ఆమె కుటుంబాన్ని అగ్రవర్ణాల సభ్యులు కొట్టారు. బాలిక పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. ఆమె పాఠశాల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా అగ్రవర్ణాలకు చెందిన పలువురు వ్యక్తులు బాలికను బెదిరించారు. "మా గ్రామంలో ఏ అమ్మాయిని అనుమతించనప్పుడు పాఠశాలకు వెళ్లడానికి మీకు ఎంత ధైర్యం" అని బెదిరించారు. బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పగా, వారు నిరసన వ్యక్తం చేశారు. అయితే, ఈ క్రమంలోనే అగ్రవర్ణాల వ్యక్తులు వారిని కొట్టారు. వారి దాడిలో కుటుంబ సభ్యులతో పాటు ఆమె బంధువులు ఐదుగురు గాయపడ్డారు. అయితే, ఈ గ్రామంలోని బాలికలను పాఠశాల నుండి నిరోధించడాన్ని పరిపాలన యంత్రాంగం ఖండించింది.
ఈ సంఘటన జూలై 23 సాయంత్రం జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామంలో జరిగింది. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కొన్ని కర్రలు చేతపట్టిన వ్యక్తులు బాలిక కుటుంబంపై దాడి చేయడం, వారిపై దుర్భాషలాడడం కనిపిస్తుంది. పాఠశాలకు వెళ్లకుండా తనను ఎలా బెదిరించారనే దానిపై బాలిక వీడియో ప్రకటన కూడా విడుదల చేసింది. తన క్లాస్మేట్తో కలిసి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా నలుగురు యువకులు అడ్డగించారని ఎఫ్ఐఆర్లో పేర్కొంది. "నా కజిన్ జోక్యం చేసుకోవడంతో, వారు అతనిని కొట్టారు. సుమారు 15-20 నిమిషాల తర్వాత, యువకుల కుటుంబ సభ్యులు నా కుటుంబంపై దాడి చేశారు" అని ఆమె ఎఫ్ఐఆర్లో పేర్కొంది. తనను పాఠశాలకు వెళ్లకుండా ఆపారని బాలిక తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సబ్డివిజనల్ పోలీసు అధికారి దీపా డోడ్వే తెలిపినట్టు టీవోఐ నివేదించింది. ఆమె ప్రకటనలను మేము ఇంకా ధృవీకరించలేదు. రెండు గ్రూపులు పాత శత్రుత్వాన్ని పెంచుకుంటున్నాయి అని సబ్డివిజనల్ పోలీసు అధికారి దీపా దోడ్వే తెలిపారు.
గ్రామంలో అగ్రవర్ణాల కంటే దళితుల సంఖ్య చాలా ఎక్కువ. సమీప పాఠశాల 3కి.మీ దూరంలో పక్క గ్రామంలో ఉంది. కొంతమంది పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకోవడానికి షాజాపూర్ వెళ్తారు. బాలికలు పాఠశాలకు వెళ్లకూడదని కొన్ని వర్గాలు కోరినప్పటికీ, ఇప్పటివరకు హింస జరగలేదని గ్రామస్థుడు ఒకరు తెలిపారు.కాగా, ఈ ఘటనపై జిల్లా యంత్రాంగం స్పందిస్తూ.. ఈ ఘర్షణ కులానికి సంబంధించినది కాదనీ, అలాగే, బాలికలను పాఠశాలకు రానీయకుండా నిరోధించే విషయాన్ని ఖండించారు. బావి, రోడ్డు విషయంలో జరిగిన గొడవ అని చెబుతున్నారు. పాత కక్షల కారణంగానే ఈ దాడి జరిగిందని స్థానిక తహసీల్దార్ విచారణలో తేలిందని చెప్పడం గమనార్హం. ఏ వర్గానికీ కులం, ఆధిపత్యం అనే సమస్య లేదు. బాలికలను పాఠశాలకు వెళ్లకుండా ఆపడం లేదు' అని జిల్లా కలెక్టర్ దినేష్ జైన్ అన్నారు. రాజ్పుత్ కుటుంబానికి చెందిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
