బంగాళాఖాతంలో అల్పపీడనం.. సిట్రాంగ్ తుఫాను అలర్ట్ ప్రకటించిన ఐఎండీ.. ఒడిశా అప్రమత్తం !
Cyclone: అక్టోబరు 21 వరకు కోస్తా, అంతర్గత కర్ణాటక, కేరళ, మహే, తమిళనాడు, కారైకల్, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్ర ప్రదేశ్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే, రుతుపవనాలు వెళ్లిపోయేముందు మరో తుఫాను రావచ్చునని అంచనా వేసింది.
Bay of Bengal: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ వారం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. వాయుగుండంపై భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అలర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ ప్రకారం.. రాబోయే 48 గంటల్లో, ఆగ్నేయ-తూర్పు-మధ్య ప్రాంతాల్లో అల్పపీడనం ప్రభావం చూపుతుంది. ఆ తర్వాత పశ్చిమ దిశగా పయనిస్తుంది. అక్టోబర్ 22 ఉదయం నాటికి ఇది తీవ్ర తుఫానుగా మారవచ్చునని ఐఎండీ అంచనా వేసింది. అంతకుముందు, అక్టోబరు 21 వరకు కోస్తా, అంతర్గత కర్ణాటక, కేరళ, మహే, తమిళనాడు, కారైకల్, పుదుచ్చేరి, కోస్తా ఆంధ్ర ప్రదేశ్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే, రుతుపవనాలు వెళ్లిపోయేముందు మరో తుఫాను రావచ్చునని అంచనా వేసింది.
సముంద్ర తీరప్రాంతాల్లో కూడా తుఫాను విధ్వంసం సృష్టించవచ్చని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. అయితే, అల్పపీడన ప్రాంతం అభివృద్ధి చెందిన తర్వాత మాత్రమే దాని ఖచ్చితమైన సమాచారం ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. అంచనాల దృష్ట్యా, ఒడిశా ప్రభుత్వం అక్టోబర్ 23 నుండి 25 వరకు ఉద్యోగుల సెలవులను రద్దు చేసింది. దీంతో పాటు కోస్తా జిల్లాల్లో ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. ఇప్పుడు కూడా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తమిళనాడు, కేరళ సహా 10 రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈసారి రుతుపవనాలు ఆలస్యమవగా, ఇప్పుడు పశ్చిమ అవాంతరాల కారణంగా చాలా చోట్ల వర్షం కురుస్తోంది. మహారాష్ట్రలోని పూణేలో మంగళవారం కుండపోత వర్షం కురిసింది. అదే సమయంలో తమిళనాడు, కేరళలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఇది కాకుండా, ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలో నిరంతర తగ్గుదల నమోదవుతోంది. కొండ ప్రాంతాల్లో మంచు కురుస్తోంది. దీని కారణంగా ఉత్తర భారతదేశంలో చలి వేగంగా పెరుగుతుంది. వాతావరణ శాఖ ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, అండమాన్-నికోబార్ దీవులు, కేరళ, కర్ణాటక, గోవా, పుదుచ్చేరి, తమిళనాడు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అక్టోబరు 24 నాటికి బంగాళాఖాతంలో రుతుపవనాల అనంతర తొలి తుఫాను ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం తెలిపింది. ఇది అభివృద్ధి చెందితే, 2018 నుండి అక్టోబరు నెలలో బంగాళాఖాతంలో ఏర్పడే మొదటి తుఫాను అవుతుంది. ఇది తుఫానుగా మారిన తర్వాత, దీనిని సిట్రాంగ్ (సి-ట్రాంగ్) అని పిలుస్తారు.దీనికి థాయ్లాండ్ పేరు పెట్టింది. మే ప్రారంభంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను తర్వాత ఈ ఏడాది సిట్రాంగ్ రెండో తుఫాను కానుంది.
వాతావరణ విభాగం అంచనాల ప్రకారం.. తుఫాను ఎక్కువగా పశ్చిమ దిశగా కదులుతూ భారతదేశ తూర్పు తీరానికి దగ్గరగా ఉంటుంది. ఉత్తర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా ప్రాంతాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. సోమవారం నుంచి ఉత్తర అండమాన్ సముద్రంలో తుఫాన్ వాయుగుండంగా మారిందనీ, దీని ప్రభావంతో గురువారం నాటికి ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.