Lalu Prasad Yadav: 13 ఏళ్ల నాటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు జార్ఖండ్లోని పాలములోని ప్రత్యేక కోర్టు బుధవారం రూ.6,000 జరిమానా విధించింది.
Lalu Prasad Yadav: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు మరో షాక్ తగిలింది. 13 ఏళ్ల నాటి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులో లాలూకు ఊహించని పరిణామం ఎదురైంది. ఈ కేసులో ఆయనకు జార్ఖండ్లోని పాలములోని ప్రత్యేక కోర్టు రూ.6,000 జరిమానా విధించింది. ఈ కేసు విషయమై బుధవారం ఆర్జేడీ చీఫ్,బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ కోర్టుకు హాజరయ్యారు. లాలూ యాదవ్తో పాటు ఆయన భార్య, కుమార్తెలతో పాటు పలువురి పేర్లతో రైల్వే జాబ్ కోసం భూమి కేసులో సీబీఐ గత నెలలో ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.
ఈ సందర్భంలో లాలూ ప్రసాద్ యాదవ్ తరపు లాయర్ అడ్వకేట్ ధీరేంద్ర కుమార్ సింగ్ మాట్లాడుతూ. "బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పిటిషన్ను విచారించిన కోర్టు అతనికి రూ. 6000 జరిమానా విధించింది. కేసు పరిష్కరించబడింది. అతను ఇప్పుడు ఎలాంటి అభియోగాలు లేవు అతను మళ్లీ ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. అని పేర్కొన్నారు.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు-2009 సమయంలో.. గర్వా అసెంబ్లీ నియోజకవర్గం నుండి RJD అభ్యర్థి గిరినాథ్ సింగ్ ప్రచారంలో లాలూ ప్రసాద్ యాదవ్ హెలికాప్టర్లో వచ్చారు. ఈ సమయంలో గర్వాలోని గోవింద్ హైస్కూల్లో లాలూ సమావేశం జరగాల్సి ఉంది. హెలికాప్టర్ను ల్యాండ్ చేసేందుకు గార్వా బ్లాక్లోని కళ్యాణ్పూర్లో హెలిప్యాడ్ను ఏర్పాటు చేశారు. ఇందుకు అధికార యంత్రాంగం అనుమతి ఇచ్చింది. కానీ నిర్దేశిత హెలిప్యాడ్లో దిగకుండా.. గోవింద్ హైస్కూల్ మైదానంలో సమావేశ స్థలంలో హెలికాప్టర్ దిగింది. దీంతో కలకలం రేగింది.
లాలూ యాదవ్ ఈ చర్యను ఎన్నికల సంఘం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనగా పరిగణించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. ఆ తర్వాత రాజకీయంగా తీవ్ర విమర్శలు వెల్లువడ్డాయి. లాలూ పక్షాన ప్రజలు హెలికాప్టర్ దారి తప్పిపోయిందని, ప్రతిపక్షం మాత్రం జనాన్ని సమీకరించడానికే లాలూ ఇదంతా చేశారన్నారు. అయితే ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం లాలూ ప్రసాద్ యాదవ్ను నిర్దోషిగా ప్రకటించింది. కానీ, అతడికి కోర్టు రూ.6 వేలు జరిమానా విధించింది.
ఇదిలా ఉంటే.. గత నెలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) 'రైల్వే ఉద్యోగం కోసం భూమి' కేసులో లాలూ యాదవ్, అతని భార్య, కుమార్తెలతో పాటు పలువురిని నిందితులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. ఢిల్లీ, బీహార్లోని లాలూ యాదవ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన 17 చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది. యాదవ్ 2004 నుంచి 2009 మధ్య రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఈ కుంభకోణం జరిగిందని సీబీఐ పేర్కొంది. ఈ క్రమంలో అతని ప్రయాణంపై ఆంక్షాలు విధించింది.
అయితే.. కిడ్నీ మార్పిడి కోసం విదేశాలకు వెళ్లాల్సి ఉన్నందున రెన్యూవల్ కోసం తన పాస్పోర్ట్ను విడుదల చేయాలని కోరుతూ లాలూ యాదవ్ రాంచీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. లాలూ యాదవ్ కిడ్నీ మార్పిడి కోసం సింగపూర్కు వెళ్లే అవకాశం ఉంది. అక్కడ డాక్టర్తో అపాయింట్మెంట్ కోసం ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే, పాస్పోర్ట్ను పునరుద్ధరించడానికి కోర్టులో దరఖాస్తు దాఖలు చేశారు.