లాలూ ప్రసాద్ యాదవ్ మీద ఆయన కూతురు రోహిణి ఆచార్య ట్విటర్ లో భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు. ఆస్పత్రిలో ఉన్న లాలూ ఫొటోలతో ఈ పోస్ట్ చేశారు.
బీహార్ : రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జెడి) అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రెండు రోజుల క్రితం మెట్లమీది నుంచి జారిపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జారి పడటంతో వీపు భాగాన గాయమై, భుజం విరిగింది. దీంతో ఆయనకు పట్నాలోని పారస్ ఆస్పత్రిలోని ఐసీయూలో వైద్యం అందిస్తున్నారు. పలు అనారోగ్య సమస్యలతో ఇప్పటికే బాధపడుతున్న లాలూ.. మూత్రపిండాల మార్పిడి చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో లోనే ఈ ప్రమాదం జరిగింది.
ఈ క్రమంలో ఆయన కుమార్తె రోహిణీ ఆచార్య తండ్రి ఆరోగ్య పరిస్థితి పట్ల భావోద్వేగానికి గురయ్యారు. ట్విట్టర్ వేదికగా ఆమె తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. ఆయన ఆస్పత్రిలో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ.. తండ్రే తన హీరోఅని ఆయన మీద తనకున్న ప్రేమను చాటుకున్నారు. ‘నా హీరో.. నా బ్యాక్ బోన్.. త్వరగా కోలుకో నాన్న.. ప్రతి ఆటంకాన్నీ ఎదుర్కొని.. నిలబడ్డ ఆయన వెంటనే ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. వారి అభిమానమే ఆయనకు బలం’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం సింగపూర్ లో ఉన్న ఆమె వీడియో కాల్ ద్వారా తన తండ్రి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ రోజు ఆర్జెడి 26 వ్యవస్థాపక దినోత్సవం. అయితే పార్టీ శ్రేణులు తమ అధినేత ఆసుపత్రిలో ఉండడంతో భారీ వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఇదిలా ఉండగా, గత కొద్దికాలంగా లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో పాటు కోర్టు కేసులూ ఎదుర్కొంటున్నారు. ప్రత్యక్ష రాజకీయాలకు కాస్త దూరంగా ఉన్నారు. పార్టీ పగ్గాలను ఇద్దరు కుమారులలో ఒకరికి అప్ప చెబుతారని ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న చిన్న కుమారుడు తేజస్వి యాదవ్ కే పార్టీ బాధ్యతలు అందుతాయని వార్తలు ఊపందుకున్నాయి. అయితే గతంలో ఈ వార్తలను లాలూ భార్య రబ్రీ దేవి ఖండించారు.