కేరళ ఎన్నికల్లో నామినేషన్, ఆరుసార్లు లింగమార్పిడి.. ట్రాన్స్ జెండర్ మృతి
గతేడాది జూన్లో ఆమె ఆరు లింగ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. వీటి వల్లనే అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు సమాచారం.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ వేసి అందరి దృష్టి తనవైపు తిప్పుకున్న ట్రాన్స్ జెండర్ అనన్య కుమారి అలెక్స్ తాజాగా బలవన్మరణానికి పాల్పడ్డారు. కొచ్చిలో తాను నివాసం ఉంటున్న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం గమనార్హం.
అయితే.. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందనే విషయం మాత్రం తెలియరాలేదు.అనన్య కుమారి ఏడాది నుంచి పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కుంటున్నారు. గతేడాది జూన్లో ఆమె ఆరు లింగ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయించుకున్నారు. వీటి వల్లనే అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు సమాచారం.
తనకు సర్జరీ చేసిన ఆస్పత్రి, వైద్యులపై పలు ఆరోపణలు చేశారు అనన్య కుమారి. లింగ మార్పిడి చికిత్సల అనంతరం తాను పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నానని తెలిపారు. సర్జరీ చేసి ఏడాది పూర్తి కావొస్తున్న తన ఆరోగ్యం కుదుటపడలేదని.. దారుణమైన బాధ కలుగుతుందని ఆరోపించారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యం వల్లే తాను ఇంకా కోలుకోలేకపోతున్నానని.. తనకు న్యాయం చేయాలని గతంలో అనన్య కుమారి డిమాండ్ చేశారు. అనన్య ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో అన్యన్య కుమారిది ఆత్మహత్యగా తేల్చారు పోలీసులు. అనారోగ్య కారణాల వల్లనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు భావిస్తున్నారు.