ఖలిస్తానీల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓట్లు కొంటున్నారని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఆదివారం ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ (aap) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (arvind kejriwal)పై ఢిల్లీ బీజేపీ (bjp) చీఫ్ ఆదేశ్ గుప్తా (adesh gupta) తీవ్రంగా విమర్శలు చేశారు. కేజ్రీవాల్ ఖలిస్తానీల నుంచి డబ్బులు తీసుకుని ఓట్లను కొంటున్నారని ఆదివారం ఆయన విమర్శించారు. గత కొన్ని రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ నాయకుడు కుమార్ విశ్వాస్, పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీలు చేసిన ఇలాంటి వాదనల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వచ్చాయి.
‘‘ కఠినమైన నిజం ఏమిటంటే, అతను (కేజ్రీవాల్) ఖలిస్తానీల నుంచి డబ్బు తీసుకొని వారు ఏమి చెప్పినా అంగీకరిస్తూ ఓట్లను కొంటున్నాడు. అతడు తనను తాను స్వీటెస్ట్ టెర్రరిస్ట్ అని పిలుచుకుంటున్నాడు. అతను ఢిల్లీ అల్లర్లలో పాల్గొన్న వారిని ఆప్లో చేర్చుకున్నాడు. ’’ అని ఆదేశ్ గుప్తా వాదించారు. కేజ్రీవాల్ వస్తున్న ఆరోపణలు నేపథ్యంలో రెండు రోజుల కిందట ఆయన స్పందించారు. తనపై వస్తున్న ఆరోపణలు నవ్వు తెపిస్తున్నాయని అన్నారు. ప్రపంచంలో స్కూల్స్, హాస్పిటల్స్ కడుతున్న స్వీట్ తీవ్రవాదిని తానే కావొచ్చని ఇటీవల ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి ఆదేశ్ గుప్తా మాట్లాడారు.
ఆదివారం దేశ రాజధానిలో జరిగిన ఓ నిరసన కార్యక్రమంలో ఆదేశ్ గుప్తా పాల్గొని ప్రసంగించారు. రిపబ్లిక్ డే పరేడ్ను వ్యతిరేకిస్తూ సిట్ను నిర్వహించినప్పుడు కేజ్రీవాల్ నీచమైన, దేశ వ్యతిరేక మనస్తత్వం తెరపైకి వచ్చిందని అన్నారు. అలాగే పంజాబ్లోని ఖలిస్తానీ మద్దతుదారులు 2020లో ప్రజాభిప్రాయ సేకరణ అంశానికి మొదట మద్దతు ఇచ్చింది అరవింద్ కేజ్రీవాలే అని ఆరోపించారు.
పంజాబ్లోని వేర్పాటువాదులకు సీఎం కేజ్రీవాల్ మద్దతు ఇస్తున్నారని కవిగా మారిన రాజకీయ నాయకుడు కుమార్ విశ్వాస్ ఇటీవల ఆరోపించారు. ఆయన పంజాబ్ కు సీఎం కావాలనుకున్నారని, లేదా ఖలిస్తానీల ద్వారా ఏర్పడిన పంజాబ్ దేశానికి మొదటి ప్రధాని కావాలని అనుకున్నారని తనతో చెప్పారని కుమార్ విశ్వాస్ సంచలన ఆరోపణలు చేశారు. వీటిని ఆధారంగా చేసుకొని కాంగ్రెస్, బీజేపీ ఆయనపై తీవ్రంగా దాడి చేస్తున్నాయి. కుమార్ విశ్వాస్ గతంలో ఆమ్ ఆద్మీ పార్టీతో కలిసి పని చేశారు. అయితే రాజ్యసభ సీటు కేటాయింపు విషయంలో అరవింద్ కేజ్రీవాల్ కు, ఆయనకు విబేధాలు వచ్చాయి. అప్పటి నుంచి సందర్భానుసారం కేజ్రీవాల్ పై విశ్వాస్ కుమార్ ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే చేసిన ఆరోపణలు మాత్రం తీవ్ర దుమారం రేపాయి.
కుమార్ విశ్వాస్ చేసిన ఆరోపలు ఆధారంగా చూపుతూ పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. వేర్పాటువాదులతో చేతులు కలుపుతున్న అరవింద్ కేజ్రీవాల్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి హోం మంత్రి షా సమాధానం ఇచ్చారు. భారత దేశ ఐక్యత, సమగ్రతతో ఆడుకోవడానికి ఎవరికీ అనుమతి లేదని ఆయన అన్నారు. నిషేధించిన వేర్పాటువాద సంస్థ సిక్కు ఫర్ జస్టిస్ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చిన విషయాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుందని చెప్పారు. అధికారాన్ని చేజిక్కించుకోవడానికి కొందరు వ్యక్తులు వేర్పాటువాదులతో చేతులు కలపడంతో పాటు పంజాబ్ను, దేశాన్ని విచ్ఛిన్నం చేసే స్థాయికి వెళ్లడం అత్యంత ఖండనీయమని కూడా హోంమంత్రి అన్నారు.
