కుమారస్వామికి గండం: మళ్లీ రిసార్ట్స్ రాజకీయాలు
కర్ణాటక రాష్ట్రంలో మరోసారి రాజకీయాలు వేడేక్కాయి. సంక్రాంతి తర్వాత కర్ణాటకలో ప్రభుత్వం మారనుందని బీజేపీ చెబుతోంది. మరో వైపు తమకు సంఖ్యాబలం ఉందని కాంగ్రెస్ జేడీఎస్ నేతలు ప్రకటిస్తున్నారు.
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో మరోసారి రాజకీయాలు వేడేక్కాయి. సంక్రాంతి తర్వాత కర్ణాటకలో ప్రభుత్వం మారనుందని బీజేపీ చెబుతోంది. మరో వైపు తమకు సంఖ్యాబలం ఉందని కాంగ్రెస్ జేడీఎస్ నేతలు ప్రకటిస్తున్నారు. ఈ తరుణంలో బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలను రిసార్ట్స్కు తరలించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది.
కర్ణాటక రాష్ట్రంలోని బీజేపీకి చెందిన 102 మంది ఎమ్మెల్యేలను ఆ పార్టీ హర్యానా రిసార్ట్స్కు సోమవారం నాడు తరలించింది.సంక్రాంతి తర్వాత కర్ణాటకలో ప్రభుత్వం మారనుందని బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.. కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ కలిసి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తే బీజేపీకి ఇబ్బందికరమైన పరిస్థితులు తప్పవు.
ఈ రెండు పార్టీలకు ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది. దక్షిణాదిలో కర్ణాటక రాష్ట్రం నుండే ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. అయితే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉంటేనే ఎక్కువ ఎంపీ సీట్లను కైవసం చేసుకోవచ్చనే అభిప్రాయం బీజేపీ నేతల్లో ఉంది.
కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ కూటమి విడిపోతే ఉనికి కోసం జేడీఎస్ ఎన్డీఏలో చేరడమో, ఒంటరిగా పోటీ చేయడమో చేయనుంది. రాజకీయంగా ఇది తమకు కలిసొచ్చే పరిణామంగా బీజేపీ నేతలు భావిస్తున్నారు.
ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ ముంబైకి తరలించిందని వారంతా కన్పించడం లేదని మంత్రి డికె శివకుమార్ ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటి నుండి బీజేపీ పదే పదే ఇదే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు.
కేబినెట్ నుండి తప్పించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఝారకోలి తన వైపు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేను తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు. ఇద్దరిని మాత్రమే బీజేపీ తమ వైపుకు తిప్పుకొందని శివకుమార్ అభిప్రాయపడ్డారు.
కర్ణాటక అసెంబ్లీలో 224 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు 80 మంది, జేడీఎస్ కు 37 మంది సభ్యులున్నారు. బీఎస్పీకి ఒకటి, ఇద్దరు స్వతంత్రులు కాంగ్రెస్, జేడీఎస్ కూటమికి మద్దతిచ్చారు. దీంతో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 14 మంది ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వానికి దూరమైతే ఇబ్బందులు తప్పవు.
జేడీఎస్ నుండి ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. 10 మంది బీజేపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటున్న కాంగ్రెస్ వర్గాలు. మొత్తంగా కర్ణాటక రాజకీయాలు మరోసారి వేడేక్కాయి.