కర్నాటకలోని బెలగావిలో ఉన్న శ్రీ గురు మడివాళేశ్వర మఠానికి చెందిన బసవ సిద్దలింగ స్వామి సోమ‌వారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘ‌ట‌న స్థలంలో సూసైడ్ నోట్ ల‌భించింది. 

కర్ణాటకలోని ప్రముఖ‌ లింగాయత్ పీఠాధిపతులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం చర్చ‌నీయంగా మారింది. మైనర్లను లైంగికంగా వేధించ‌డాన్ని ఆరోప‌ణ‌లను రావ‌డంతో చిత్రదుర్గలోని లింగాయత్ మఠాధిపతి శ్రీ శివమూర్తి మురుగ శరణుపై పోక్సో యాక్ట్ కింద కేసు న‌మోదైంది. దీంతో ఆయ‌న‌ను గ‌త వారం అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. తాజాగా ఆయ‌నను చిత్రదుర్గ జిల్లా కోర్టు సెప్టెంబర్ 14 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఇదిలాఉంటే.. తాజాగా ఆరోపణ‌లెదుర్కొంటున్న మఠ సిబ్బంది ఒకరు సోమవారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. 

వివ‌రాల్లోకెళ్తే.. బెలగావిలోని శ్రీ గురు మదివాలేశ్వర్ మఠానికి చెందిన బసవ సిద్ధలింగ స్వామి ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఘటనాస్థలంలో పోలీసుల‌కు సూసైడ్‌ నోట్‌ దొరికింది. అతని మరణానికి గల కారణాలను తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు. సూసైడ్ నోట్‌లో ఏముందనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. తన క్వార్టర్స్‌లోనే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అనుచర గణం పోలీసులకు వెల్లడించింది. 

లైంగిక వేధింపుల నేప‌థ్యంలో రాష్ట్రంలో ఓ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. అందులో ఇద్దరు మహిళలు చర్చిస్తున్నట్లు కనిపించిన వీడియోపై మ‌త గురువు కలత చెందినట్లు ఆశ్ర‌మ వర్గాలు చెబుతున్నాయి. ఆ వీడియోలో లింగాయత్‌ కమ్యూనిటీకి చెందిన బసవ సిద్ధలింగ పేరు కూడా ప్రస్తావన వచ్చింది. దీంతో తీవ్ర ఆందోళ‌న చెందిన ఆయన ఆత్మ‌హ‌త్య చేసుకుని ప్రాణాలు విడిచారు. 

ఈ నెల ప్రారంభంలో నుండి రాష్ట్రంలోని కీలకమైన లింగాయత్ సెమినరీలలో ఒకటైన మురుగ మఠానికి అధిపతిగా ఉన్న శివమూర్తి శరణారావు ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. కొన్నాళ్లుగా తమపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని బాలికలిద్దరూ ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో కర్నాటకలోని చిత్రదుర్గ, మైసూరు జిల్లాల్లో పౌరసమాజ సభ్యులు, వివిధ సంస్థల నిరసనల నేపథ్యంలో ఆయనను అరెస్టు చేశారు.