మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ మనవుడు ప్రజ్వల్ రేవన్న పార్లమెంట్ సభ్యత్వంపై కర్ణాటక హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఆయన ఎన్నిక చెల్లదని, ఎన్నికల సమయంలో అవకతవకలకు పాల్పడినందున ఈసీ కూడా ఆయనపై యాక్షన్ తీసుకోవాలని సూచించింది. 

బెంగళూరు: మాజీ ప్రధాని హెచ్‌డీ దేవె గౌడ మనవుడు ప్రజ్వల్ రేవన్నపై కర్ణాటక హైకోర్టు అనర్హత వేటు వేసింది. హస్సన్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన రేవన్నపై అనర్హత వేటు వేస్తూ శుక్రవారం తీర్పు ఇచ్చింది. 

దేవె గౌడ మనవడు ప్రజ్వల్ రేవన్న ఎన్నికల సమయంలో అవకతవకలకు పాల్పడ్డాడని, ఎన్నికల అఫిడవిట్‌లోనూ అస్తులను సరిగా చూపించలేదని ఆరోపిస్తూ ఆయనపై రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. హస్సన్ నియోజకవర్గ ఓటరు జీ దేవేరాజె గౌడ, రేవన్న పై బీజేపీ టికెట్ పై పోటీ చేసి ఓడిపోయిన ఏ మంజు పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లను పాక్షికంగా స్వీకరిస్తూ జస్టిస్ కే నటరాజన్ తీర్పు వెలువరించారు.

ప్రజ్వల్ రేవన్న లోక్ సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేశారు. అంతేకాదు, ఎన్నికల్లో అవకతవకలు పాల్పడినందున ప్రజ్వల్ రేవన్నపై యాక్షన్ తీసుకోవాలని ఎన్నికల సంఘానికీ సూచించింది. అయితే.. ఏ మంజును ఎంపీగా డిక్లేర్ చేయాలన్న విజ్ఞప్తిని జస్టిస్ నటరాజన్ తోసిపుచ్చారు. మంజు పైనా అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. 

Also Read: తులాభారం: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు నామినేషన్ కోసం డబ్బులు అందించిన మేదరి సంఘం సభ్యులు

రేవన్న పై ఓడిపోయిన తర్వాత మంజు బీజేపీ నుంచి జేడీఎస్‌లో చేరారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే కూడా.