దేవాలయం సమీపంలోనే.. మద్యం మత్తులో యువతిపై సామూహిక అత్యాచారం...
మంగళవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో చాముండికొండ దగ్గర లలితాద్రిపుర సమీపంలో ఈ దారుణం జరిగింది. మైసూరు వర్సిటీలో పరిశోధక విద్యార్థినిగా భావిస్తున్న యువతి, ఆమె స్నేహితునితో కలిసి మాట్లాడుతూ ఉండగా, ఇద్దరు దుండగులు వారి దగ్గరకు వచ్చారు. డబ్బు, విలువైన వస్తువుల్ని ఇవ్వాలని బెదిరించారు.
మైసూరు : మైసూరులో దారుణ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ప్రశాంత మైసూరు నగరంలో నగల షాపులో దోపిడీ దొంగలు లూటీ చేసి ఒకరిని కాల్చి చంపిన దారుణ ఘటన జరిగి మూడు రోజులు కూడా కాకముందే మరో ఘోరం జరిగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చాముండేశ్వరి అమ్మవారి దేవాలయానికి కొద్ది దూరంలో ఒక యువతి మీద సామూహిక లైంగిక దాడి జరిగింది.
మంగళవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో చాముండికొండ దగ్గర లలితాద్రిపుర సమీపంలో ఈ దారుణం జరిగింది. మైసూరు వర్సిటీలో పరిశోధక విద్యార్థినిగా భావిస్తున్న యువతి, ఆమె స్నేహితునితో కలిసి మాట్లాడుతూ ఉండగా, ఇద్దరు దుండగులు వారి దగ్గరకు వచ్చారు. డబ్బు, విలువైన వస్తువుల్ని ఇవ్వాలని బెదిరించారు.
యువతి, స్నేహితుడు నిరాకరించడంతో యువకున్ని కొట్టారు. యువతి మీద అక్కడే సామూహిక అత్యాచారానికి ఒడిగట్టి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో దుండగులు మద్యం తాగి ఉన్నారు. యువతి స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఇద్దరినీ అర్థరాత్రి 1.30 సమయంలో ఆస్పత్రిలో చేర్పించారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు సామూహిక అత్యాచారం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బుధవారం ఉదయం సంఘటనాస్థలాన్ని పోలీసు అధికారులు పరిశీలించారు. దుండగులమీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు సీఎం బసవరాజు బొమ్మై తెలిపారు. హోంమంత్రి ఎ.జ్ఞానేంద్ర మాట్లాడుతూ తాను గురువారం మైసూరుకు వెళ్లి సమీక్సిస్తానని తెలిపారు. దుండగుల కోసం గాలింపు కొనసాగుతోంది.