కర్ణాటక సీఎం వాస్తును కాదని విధాన సౌధలోని తన కార్యాలయంలో దక్షిణం వైపున ఉన్న మూసేసిన తలుపును తెరిపించారు. అదే డోర్ గుండా ఓ సమావేశానికి వెళ్లారు. ఈ గదికి వాస్తు అవసరం లేదని, ఆరోగ్యవంతమైన మెదడు, నిర్మలమైన మనసు, ప్రజలకు మంచి చేయాలనే దృక్పథంతోపాటు కొంత స్వచ్ఛమైన గాలి, సరిపడా వెలుతురు ఈ గదికి అవసరం అని తెలిపారు.
బెంగళూరు: వాస్తును నమ్మేవారు చాలా మంది ఉంటారు. వాస్తు అనేది ఒక విశ్వాసమే.. నిర్మాణాలు వాస్తుకు అనుగుణంగా లేదనే ఏకైక కారణంతో సంభవించే ఉపద్రవమేదీ ఉండదు. కానీ, వీలైనంత వరకు వాస్తు ఉండేలా చూసుకుంటారు. నగరాల్లో ఇరుకైన ప్రాంతాల్లో వాస్తుకు లేకున్నా నిర్మాణాలు చేపట్టి ఆ తర్వాత దోష నివారణ చేసుకుంటారు. ఇప్పుడు వాస్తు టాపిక్ ఎందుకా.. అంటే కర్ణాటక సీఎం తీసుకున్న ఒక చిన్న నిర్ణయంపై ప్రశంసలు వస్తున్న నేపథ్యంలో దీనిపై చర్చ మొదలైంది.
తెలంగాణ సచివాలయం ఇప్పుడు సాగర తీరానా దేదీప్యమానంగా వెలిగిపోతున్నది. కానీ, పాత సచివాలయం ఏమైనా శిథిలావస్తకు చేరిందా కూల్చడానికీ? ప్రభుత్వం చెప్పిన అనేకానేక కారణాల్లో ప్రధానంగా ప్రచారంలో ఉన్నది వాస్తుకు లేకపోవడమే. ఆ సచివాలయం వాస్తుకు లేదని, అందులో నుంచి పాలిస్తే అరిష్టమని ప్రభుత్వ వర్గాలు సచివాలయ కూల్చివేతన నిర్ణయానికి సమర్థింపులుగా వాదించాయి. కానీ, నేడు కర్ణాటకలోని సీఎం సిద్ధరామయ్య.. కేసీఆర్కు భిన్నమైన పంథా ఎంచుకున్నారు.
సీఎం సిద్ధరామయ్య శనివారం ఓ సమీక్ష సమావేశం కోసం విధానసౌధలోని తన ఆఫీసుకు వెళ్లారు. అన్న భాగ్య పథకం అమలుపై రివ్యూ మీటింగ్ కోసం మూడో అంతస్తులోని తన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ సౌత్ ఫేసింగ్ డోర్ క్లోజ్ చేసే ఉన్నది. ఈ తలుపును ఎందుకు మూసే ఉంచుతున్నారని సీఎం సిద్ధరామయ్య అధికారులను అడిగారు. అటు వైపు తలుపు వాస్తును విరుద్ధమైనదని, అందుకే వాస్తు ఉండేలా ఆ తలుపును మూసే ఉంచుతున్నట్టు అధికారులు సమాధానం ఇచ్చారు.
ఈ విషయం తన చెవిన పడగానే సిద్ధరామయ్య ఆ తలుపును ఓపెన్ చేయాలని ఆదేశించారు. ఆ డోర్ గుండానే సమావేశం కోసం వెళ్లారు. మనకు కావాల్సింది వాస్తు కాదనీ.. ఆరోగ్యకరమైన మెదడు, నిర్మలమైన ఆత్మ, ప్రజానుకూల అప్రోచ్తోపాటు మంచి వాయువులు, సరిపడా వెలుతురు ఈ గదికి అవసరం అని క్లాస్ ఇచ్చారు. ఆ తర్వాత అదే డోర్ గుండా మీటింగ్కు వెళ్లుతూ మూఢనమ్మకాలపై ఆయన స్టాండ్ను స్పష్టం చేసేశారు.
