మధ్యవర్తిత్వ ప్రాధాన్యత క్రమంగా పెరుగుతోందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బాధ.. మీడియేషన్ వల్ల తప్పుతుందన్నారు.
ప్రస్తుత కాలంలో మధ్యవర్తిత్వ ప్రాధాన్యం క్రమంగా పెరుగుతోందని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో మధ్యవర్తిత్వం (Mediation) కీలక పాత్ర పోషిస్తోందని, మధ్యవర్తిత్వం వల్ల ఏండ్ల తరబడి కోర్టుల్లో పెండింగ్ ఉన్న కేసులు కూడా చాలా వరకు పరిష్కరమవుతున్నాయని అన్నారు. హైదరాబాద్ ఐఏఎంసీలో (AIMC) జరుగుతున్న ఇండియా మీడియేషన్ డే కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమ కోహ్లి, సింగపూర్ అంతర్జాతీయ మీడియేషన్ సెంటర్ చైర్మన్ జార్జ్ లిమ్ ముఖ్యఅథితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. తొలి ఇండియా మీడియేషన్ డే కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
హిందూ పురాణాల్లో కూడా మధ్యవర్తిత్వం ప్రస్తావన ఉందనీ, కౌరవులు, పాండవుల మధ్య కృష్ణుడు మధ్యవర్తిత్వం వహించడాని, కానీ ఆ మధ్యవర్తిత్వం విఫలం వల్లే మహాభారత యుద్ధం జరిగిందని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణల కారణంగా భారత్లో మధ్యవర్తిత్వ ప్రాధాన్యత పెరిగిందని, అయితే ఈ ప్రక్రియ వేగవంతంగా, విశ్వసనీయతతో సాగాలని అభిప్రాయపడ్డారు. ఉభయపక్షాలకు ఉపయోగకరంగా సాగాలని సూచించారు. మీడియేషన్ బిల్లు రాకవల్ల మధ్యవర్తిత్వం ప్రాధాన్యం మరింత పెరిగిందని, మధ్యవర్తిత్వ ప్రక్రియ వేగవంతంగా, విశ్వసనీయతతో సాగాలన్నారు. ఉభయపక్షాల మధ్య మధ్యవర్తిత్వ ప్రక్రియ ఉపయోగకరంగా సాగాలని సూచించారు.
మధ్యవర్తిత్వంలోనూ కృత్రిమ మేథను భాగం చేస్తున్నారని అన్నారు. తనకు జడ్జిగా 22 ఏళ్ల అనుభవం ఉందని జస్టిస్ రమణ చెప్పారు. హైదరాబాద్లో మీడియేషన్ కేంద్రం ఏర్పాటుపై తాను, జస్టిస్ లావు నాగేశ్వరరావు పలుసార్లు చర్చించుకున్నామని జస్టిస్ రమణ చెప్పారు. మొదట్లో తాను చిన్న స్థాయిలో కేంద్రం ఏర్పాటు చేద్దామనుకున్నానని, కానీ.. జస్టిస్ నాగేశ్వరరావు దాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దారని, జస్టిస్ హిమకోహ్లి కూడా ఎంతో సహకరించారని జస్టిస్ రమణ తెలిపారు.
చోళుల కాలంలోనూ
అనంతరం జస్టిస్ హిమకోహ్లి మాట్లాడుతూ.. న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం ఓ కీలకమైన అంశమని,సమస్యల పరిష్కారంలో ప్రధాన పాత్ర వహిస్తుందని అన్నారు. చోళుల కాలంలోనూ మధ్యవర్తిత్వం అనే ప్రత్యేక వ్యవస్థ ఉండేదని, ఆ కాలంలో పలు సమస్యలను మధ్యవర్తిత్వంలో పరిష్కరించారని తెలిపారు. మన దేశంలో మధ్యవర్తిత్వ సంస్కృతి పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని, మీడియేషన్ సెంటర్లపై అవగాహన రావాలని అన్నారు. కోర్టులో వివాదాలను పరిష్కరించుకోవాలంటే.. ఎంతో సమయం, డబ్బు వృథా అవుతాయని అన్నారు. ఏండ్ల తరుబడి పెండింగ్ లో ఉన్న సమస్యలను కూడా మీడియోషన్ వల్ల రోజుల్లోనే పరిష్కరించవచ్చని తెలిపారు.
