ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. పెళ్లి వేడుకకు వచ్చిన ఎనిమిది మంది పై నుంచి ఓ జీపు దూసుకెళ్లింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. శనివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
లక్నో: ఉత్తరప్రదేశ్లో దుర్ఘటన చోటుచేసుకుంది. టమాటలు మోసుకెళ్తున్న జీపు ఎనిమిది మంది పై నుంచి దూసుకెళ్లింది. దీంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరొకరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరి పరిస్థితి సీరియస్గా ఉన్నది. చిత్రకూట్లో శనివారం ఈ దుర్ఘటన జరిగింది. శనివారం ఉదయం సుమారు 6.30 గంటలకు రౌలి కళ్యాణ్పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు చిత్రకూట్ అదనపు ఎస్పీ శైలేంద్ర రాయ్ తెలిపారు.
మృతులు నరేశ్ (35), అరవింద్ (21), రామస్వరూప్ (25), ఛక్కా (32), సోమ్ దత్ (25)లు ఘటనా స్థలిలోనే అక్కడికక్కడే మరణించారు. కాగా, భాను ప్రతాప్ (32) హాస్పిటల్లో గాయాలతో బాధపడుతూ చనిపోయారు. కాగా, భగవాన్ దాస్ (45), రామ నారాయణ్ (50)ల పరిస్థితి ఇప్పుడు విషమంగా ఉన్నట్టు పోలీసు వివరించారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించారు. అలాగే, ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు పరిహారం అందిస్తున్నట్టు సీఎం కార్యాలయం ట్విట్టర్లో వెల్లడించింది. అలాగే, గాయపడిన వారికి రూ. 50 వేల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వబోతున్నట్టు తెలిపింది. అలాగే, ఆ జీపు డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోబోతున్నట్టు వివరించింది.
బాధితులు అందరూ బాండా జిల్లా జారి గ్రామానికి చెందిన వారని అదనపు ఎస్పీ తెలిపారు. అయితే, వారంతా రౌలి కళ్యాణ్పూర్లో ఓ పెళ్లి వేడుకలో హాజరుకావడానికి వచ్చారని చెప్పారు. జీపు డ్రైవర్ను పోలీసులు అరెస్టు చేసినట్టు వివరించారు.
