సెప్టెంబర్ 2వ తేదీన శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఆదిత్య ఎల్-1 మిషన్ను ప్రయోగించనుంది. కొన్ని సూర్యుడి రహస్యాలనూ తెలుసుకోవడానికి ఈ ప్రయోగం చేస్తున్నారు. అయితే.. ఆదిత్య ఎల్-1 మిషన్ను సూర్యుడి మీదికి పంపరు. దాన్ని ఎల్-1 అనే ఓ పాయింట్ వద్దకు పంపి సూర్యుడి పై ప్రయోగాలు చేస్తారు.
న్యూఢిల్లీ: చంద్రయాన్ 3 విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో ఇప్పుడు సూర్యుడిపై ప్రయోగాలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2వ తేదీన ఆదిత్య ఎల్-1 మిషన్ను ఇస్రో పీఎస్ఎల్వీ సహాయంతో శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగిస్తారు. ఈ మిషన్ వాస్తవానికి చంద్రుడి మీదికి వెళ్లదు. దీన్ని లాగ్రేంజ్ పాయింట్ 1 (ఎల్-1) వద్దకు పంపుతారు. ఇంతకీ ఎల్-1 అంటే ఏమిటీ?
సూర్యుడ మండే అగ్నిగోళం. అందులో హైడ్రోజన్, హీలియం అణువులు అగ్ని జ్వాలలను సృష్టిస్తాయి. గ్యాస్, ప్లాస్మా నిండిని ఒక బాల్గా దీన్ని వర్ణిస్తుంటారు. దీని వద్దకు వెళ్లినా మాడిపోవడం మినహా మరేమీ ఉండదు. దీనిపై ల్యాండ్ అయ్యే పరిస్థితులూ ఉండవు. అందుకే ఇస్రో సూర్యుడిపై చేయనున్న ప్రయోగాలకు పంపే ఆదిత్య ఎల్-1 మిషన్ గురించి కొంత గందరగోళం ఉన్నది. ఇస్రో ఆదిత్య ఎల్-1 మిషన్ను సూర్యుడి మీదికి ప్రయోగిస్తుందా? లేక దానికి కొంత దూరంలో ఉంచి పరిశీలిస్తుందా? అనేదానిపై చర్చ ఉన్నది.
ఆదిత్య ఎల్-1 మిషన్ను ఇస్రో సూర్యుడిపైకి పంపదు. కానీ, దీన్ని లాగ్రేంజ్ ఎల్-1 అనే పాయింట్ వద్దకు పంపిస్తారు. ఈ పాయింట్ ఎక్కడుందనేగా మీ డౌటు. ఇది భూమికి సూర్యుడి వైపున (భూ కక్ష్యలోపలి వైపు) 1.5 మిలియన్ (15 లక్షల) కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇస్రో శాస్త్రవేత్తలు ఈ పాయింట్నే ఎందుకు ఎంచుకున్నారు? దీనికీ ఒక వ్యూహం ఉన్నది.
ఖగోళంలో పెద్ద వస్తువులకు దాని పరిమాణం(బరువు!) బట్టి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. అంటే.. భూమి కంటే సూర్యుడి గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువ. అయితే.. అది ఆ వస్తువు నుంచి దూరంగా జరుగుతున్నా కొద్దీ తగ్గుతుంది. సూర్యుడు, భూగ్రహానికి మధ్య ఉండే గురుత్వాకర్షణ శక్తులు ఎల్-1 అనే పాయింట్ వద్ద దాదాపుగా సమానంగా ఉంటాయి. అంటే.. గురుత్వాకర్షణ శక్తులు ఎల్-1 పాయింట్ వద్ద ఈక్విలిబ్రియంలో ఉంటాయి. కాబట్టి, అక్కడ ఒక శాటిలైట్ను తక్కువ ఇంధన ఖర్చుతో ఎక్కువ కాలం ఆపరేట్ చేయవచ్చు. అంటే.. తక్కువ ఖర్చుతో మనం దాన్ని మూవ్ చేయవచ్చు.
Also Read: Chandrayaan-3: చంద్రయాన్ 3 విజయం ఎందుకు ముఖ్యం? చంద్రయాన్ 4 గురించి మీకు తెలుసా?
ఎల్-1 పాయింట్ ఎంచుకోవడానికి మరో కారణం కూడా ఉన్నది. ఇక్కడ నుంచి సూర్యుడిని ఎలాంటి అవాంతరాలు లేకుండా నిరాటంకంగా మనం వీక్షించుకోగలం. అంటే సూర్యగ్రహణం, ఇతర గ్రహాల వల్ల సూర్యుడిని తాత్కాలికంగా చూడలేని పరిస్థితులు ఈ పాయింట్ వద్ద ఉండవు.
ఈ ఎల్-1 పాయింట్ వద్దకు ఆదిత్య ఎల్-1 మిషన్ను ఇస్రో ప్రయోగించనుంది. ఏడు సైన్స్ పేలోడ్లను ఇది మోసుకెళ్లనుంది. ఎలక్ట్రోమ్యాగ్నెటిక్, పార్టికల్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సహాయంతో సూర్యుడి ఫొటోస్ఫేర్, క్రోమోస్ఫేర్, సూర్యుడి చివరి పొరలను పరిశీలించనున్నారు. వీటి ద్వారా సూర్యగోళంలో అపార వేడిమిని రగిల్చే సోలార్ కరోనా మెకానిజం, సోలార్ విండ్, సూర్యుడి అయస్కాంత క్షేత్రం గురించి అర్థం చేసుకోనున్నారు. వీటికితోడు సూర్యుడి రేడియేషన్ భూ ఆవరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? రోదసిలో దాని ప్రభావం ఎలా ఉంటుంది? వంటి అంశాలపైనా పరిశోధనలు చేయడానికి ఈ మిషన్ ఉపకరించనుంది.
ఆదిత్య ఎల్-1 మిషన్ను కూడా కదులుతున్న భూమి, సూర్యుడికి అనుగుణంగా మూవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే.. చాలా మంది అనుకున్నట్టు సూర్యుడు స్థిరంగా ఉండదు. సూర్యుడు కూడా వేగంగా కదులుతూ ఉంటే.. భూమి, ఇతర గ్రహాలు భిన్న కక్ష్యలో దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. స్పేస్ చాలా వేగంగా విస్తరిస్తున్నదనే విషయం తెలిసిందే. ఇది కాంతి కంటే కూడా కొన్ని లక్షల రెట్లు వేగంగా విస్తరిస్తుంది. అందుకే.. కాంతి వేగంతో మనిషి ప్రయాణించినా(ఇది దాదాపు అసాధ్యమే) విశ్వం అంచులకు(ఒక వేళ అవి ఉంటే) చేరలేడని నిపుణులు చెబుతుంటారు.
