సారాంశం
ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిపై ట్రాన్స్ జెండర్లు దాడి చేసి, అతడితో బలవంతంగా మూత్రం తాగించారు. ఈ దుశ్చర్యను వారు రికార్డు చేసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోలు వైరల్ కావడంతో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
ఇటీవల మధ్యప్రదేశ్ లో ఓ గిరిజనుడిపై ఓ నాయకుడి అనుచరుడు మూత్రం పోసిన ఘటన మరవక ముందే ఉత్తరప్రదేశ్ లో అంత కంటే ఘోరమైన ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. ఓ 32 ఏళ్ల వ్యక్తిపై ట్రాన్స్ జెండర్లు దాడి చేసి, బలవంతంగా మూత్రం తాగించారు. అంతటితో ఆగకుండా బాధితుడు నుంచి రూ.10 దోచుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.
‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కస్గంజ్ జిల్లాలోని ఇమాంబక్ష్ ప్రాంతంలోని ట్రాన్స్ జెండర్ల సమూహానికి చెందిన నాయకుడి ఇంట్లో 32 ఏళ్ల రఫీకుల్ వంట మనిషిగా పని చేస్తున్నాడు. అయితే ఈ ప్రాంతంలో కొంత కాలంగా ట్రాన్స్ జెండర్లకు చెందిన రెండు గ్రూపుల మధ్య వైరం కొనసాగుతోంది. ఈ క్రమంలో జూలై 27వ తేదీన ఎప్పటిలాగే రఫీకుల్ తన పని పూర్తి చేసుకొని గ్రామం వైపు వస్తున్నాడు. షావార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బసాయి గ్రామం వద్దకు చేరుకోగానే అతడిపై ముగ్గురు ట్రాన్స్ జెండర్లు సహా ఐదుగురు దాడి చేశారు.
అనంతరం బాధితుడితో బలవంతంగా మూత్రం తాగించారు. ఈ దుశ్చర్యను వారు తమ సెల్ ఫోన్లలో వీడియో కూడా తీశారు. దాడి తరువాత అతడిని చంపేందుకు కూడా ప్రయత్నించారు. అయితే బాధితుడి అరుపులు వినిపించడంతో పక్కన పొలాల్లో పని చేస్తున్న రైతులు, కూలీలు పరిగెత్తుకుంటూ ఘటనా స్థలానికి వచ్చారు. వారిని చూసి నిందితులు.. బాధితుడు జేబులో ఉన్న రూ.10 వేలను దోచుకొని అక్కడి నుంచి పారిపోయారు.
రైతులు బాధితుడిని రక్షించారు. హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కాగా.. రఫీకుల్ ను కొట్టి బలవంతంగా మూత్రం తాగించిన వీడియోలు నిందితులు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇవి వైరల్ గా మారాయి. దీంతో బాధితుడిని పోలీసులు గుర్తించారు. అతడి ఫిర్యాదు మేరకు ఐదుగురు నిందితులపై ఐపీసీ సెక్షన్ 395 (దోపిడీ), 294 (అశ్లీల చర్యలు), 323 (స్వచ్ఛందంగా గాయపరచడం), 504 (శాంతికి విఘాతం కలిగించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.