ఆమె భారతదేశంలోనే అత్యంత పిన్నవయసులో మేయర్ గా ప్రమాణస్వీకారం చేసిన మహిళ.. అతను కేరళ అసెంబ్లీలో చిన్నవయస్కుడైన ఎమ్మెల్యే.. వీరిద్దరూ మూడుముళ్లతో ఏకమవుతున్నారన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.
తిరువనంతపురం : దేశంలోనే అత్యంత చిన్న వయస్కురాలైన మేయర్ గా రికార్డ్ సృష్టించిన 23యేళ్ల Thiruvananthapuram మేయర్ Arya Rajendran బలుస్సేరి కేరళ అసెంబ్లీలో ప్రస్తుతం ఉన్న యంగెస్ట్ ఎమ్మెల్యే Sachin Devను వివాహం చేసుకోనున్నారు. 28 సంవత్సరాల వయసున్న, సచిన్ దేవ్ కేరళ శాసనసభలో అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యే.

ఈ వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. అయితే వీరి పెళ్లి తేదీని ఇంకా ప్రకటించలేదు. వీరి పెళ్లి విషయంలో ఇరు కుటుంబాల మధ్య ఒప్పందం కుదిరింది. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఎస్ఎఫ్ఐ లో కలిసి పనిచేశారు. ఇప్పటివరకు పెళ్లికి సంబంధించి అందుబాటులో ఉన్న విశేషాలు ఇవే. ఇంకో నెల రోజుల తర్వాత ఈ జంట పెళ్లి చేసుకోనుందని తెలుస్తోంది.
23 ఏళ్ల ఆర్య రాజేంద్రన్ భారతదేశపు అతి పిన్న వయస్కురాలైన మేయర్. ఆమె తిరువనంతపురంలోని ఆల్ సెయింట్స్ కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా పోటీ చేసిన సచిన్ దేవ్ అఖండ విజయం సాధించి బాలుశెరి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలో ఎన్నికల్లో పోటీ చేశారు.

కాగా, 2020 డిసెంబర్ లో 21 ఏళ్ల వయస్సున్న ఆర్య రాజేంద్రన్ తిరువనంతపురం కార్పోరేషన్ మేయర్ గా ఎన్నికయ్యింది. కేరళ రాష్ట్రంలో ఆ యేడు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార లెఫ్ట్ ఫ్రంట్ అధిక స్థానాలను కైవసం చేసుకొంది. అనంతరం రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో 21 ఏళ్ల వయస్సున్న ఆర్య రాజేంద్రన్ ను మేయర్ పదవికి సీపీఎం ఎంపిక చేసింది.
దీంతో మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన ఆర్య రాజేంద్రన్ దేశంలో అత్యంత చిన్న వయస్సులోనే మేయర్ గా బాధ్యతలు స్వీకరించిన మేయర్ గా రికార్డు సృష్టించారు. తిరువనంతపురం సీపీఎం జిల్లా కార్యదర్శివర్గం ఆర్య రాజేంద్రన్ పేరును మేయర్ పదవికి సూచించింది. తిరువనంతపురం కార్పోరేషన్ లోని ముదవాన్ముగల్ వార్డు నుండి ఆమె విజయం సాధించారు. ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఎం బరిలో దింపిన అభ్యర్ధుల్లో ఆర్య రాజేంద్రన్ మాత్రమే అతి చిన్న వయస్సున్న అభ్యర్ధి.

ఆర్య రాజేంద్రన్ మేయర్ గా ఎన్నికయ్యే నాటికి తిరువనంతపురంలోని ఆల్ సెయింట్స్ కాలేజీలో బీఎస్సీ గణితం చదువుతోంది. ఆమె రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు.
