నేపాల్ పోలీసుల ఘాతుకం: సరిహద్దుల్లో భారతీయుడి కాల్చివేత
సరిహద్దుల్లో ఓ భారతీయుడిని నేపాల్ పోలీసులు కాల్చి చంపారు. ఉత్తరప్రదేశ్లోని పిలిబిత్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన వ్యక్తిని గోవింద (26)గా గుర్తించామని జిల్లా ఎస్పీ వెల్లడించారు
సరిహద్దుల్లో ఓ భారతీయుడిని నేపాల్ పోలీసులు కాల్చి చంపారు. ఉత్తరప్రదేశ్లోని పిలిబిత్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. చనిపోయిన వ్యక్తిని గోవింద (26)గా గుర్తించామని జిల్లా ఎస్పీ వెల్లడించారు.
పప్పూ సింగ్, గుర్మీత్ సింగ్ లతో కలిసి గోవింద నేపాల్ లోకి ప్రవేశించాడని ఆయన తెలిపారు. అయితే, సరిహద్దుల్లోని నేపాల్ పోలీసులతో ఏదో విషయమై వారు వాగ్వాదానికి దిగారని .. ఈ క్రమంలోనే పోలీసులు కాల్పులు జరపడంతో గోవిందకు తీవ్ర గాయాలయ్యాయన్నారు.
ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ అతను చనిపోయాడని ఎస్పీ వెల్లడించారు . ఓ వ్యక్తి భయంతో మళ్లీ భారత్ లోకి తిరిగొచ్చేయగా.. మరో వ్యక్తి ఆచూకీ ఇంకా తెలియాల్సి వుందన్నారు.
పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఘటనతో పిలిబిత్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.
కాగా, భారతీయులను నేపాల్ పోలీసులు కాల్చి చంపడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. గత ఏడాది జూన్ లో ఇలాగే కాల్పులు జరపడంతో ఓ వ్యక్తి మృతి చెందగా.. నలుగురు గాయాలపాలయ్యారు.