దేశ సరిహద్దులు దాటి మరీ.. ప్రేమను గెలిపించాడు..!
యువకుడు బెంగాల్ లోని నదియా జిల్లా బల్లావ్ పూర్ కు చెందిన జైకాంతో చంద్రరాయ్(24) గా గుర్తించారు. కాగా.. అతని వెంట ఉన్న యువతిని బంగ్లాదేశ్ కి చెందిన పరిణీతి(19) గా గుర్తించారు.
ప్రేమించిన వారి కోసం ఏదైనా చేసేస్తామంటూ ప్రగల్బాలు పలికేవారు మనలో చాలా మందే ఉంటారు. అయితే.. వాటిని ఆచరణలో పెట్టేటప్పుడు మాత్రం వెనకడుగు వేస్తుంటారు. అయితే.. ఓ యువకుడు మాత్రం తాను అలా కాదని నిరూపించుకున్నాడు. తన ప్రేమను గెలిపించుకునేందుకు ఏకంగా దేశ సరిహద్దులను దాటేశాడు. ఈ సంఘటన కోల్ కతాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ లోని మాదాపూర్ సరిహద్దుల వద్ద జూన్ 26 సాయంత్రం ఓ జంట అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో.. వారిని బీఎస్ఎఫ్ అధికారులు గుర్తించారు. వారిని విచారించగా.. పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో.. ఆ ఇద్దరినీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
యువకుడు బెంగాల్ లోని నదియా జిల్లా బల్లావ్ పూర్ కు చెందిన జైకాంతో చంద్రరాయ్(24) గా గుర్తించారు. కాగా.. అతని వెంట ఉన్న యువతిని బంగ్లాదేశ్ కి చెందిన పరిణీతి(19) గా గుర్తించారు. వీరిద్దరికీ ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడగా... అది కాస్త ప్రేమగా మారింది.
ఓ మధ్యవర్తి సహాయంతో మార్చి8న చంద్రరాయ్ బంగ్లాదేశ్ వెళ్లాడు. మార్చి 10వ తేదీన పరిణీతిని అక్కడే పెళ్లి చేసుకున్నాడు. జూన్ 25 వరకు బంగ్లాదేశ్ లోనే ఉన్నాడు. ఆ తర్వాత సరిహద్దులు దాటి భారత్ లోకి ప్రవేశించారు. సరిహద్దులు దాటేందుకు ఓ వ్యక్తికి వారు10వేల బంగ్లాదేశీ టాకాలు ఇవ్వడం గమనార్హం. బీఎస్ఎఫ్ అధికారులు వీరిని పోలీసులకు అప్పగించారు.