ఐఫోన్లలో కొన్ని లోపాలున్నాయని, వీటి ద్వారా హ్యాకర్లు మీ సెన్సిటివ్ డేటాను దొంగిలించే ప్రమాదం ఉందని కేంద్రం హెచ్చరించింది.

ఢిల్లీ: కేంద్ర సైబర్ భద్రతా విభాగం అయిన సెర్ట్-ఇన్, ఆపిల్ ఉత్పత్తులు వాడుతున్నవాళ్ల కోసం ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. iPhone, iPad వాడుతున్న వినియోగదారులకు ఇది సంబంధించినది. ఇటీవలే విడుదలైన ఈ హెచ్చరిక ప్రకారం, పాత ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ వర్షన్లు వాడుతున్న వారు హ్యాకింగ్ ప్రమాదానికి లోనయ్యే అవకాశం ఉంది.ఆపిల్ సాఫ్ట్‌వేర్‌లో పలు భద్రతా లోపాలు కనిపించాయని, ఇవి హ్యాకర్లకు మాలివేర్ యాప్స్ ఇన్‌స్టాల్ చేయడానికి మార్గమిచ్చే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. ఈ లోపాల వలన ఫోన్ పూర్తిగా పనిచేయకుండా ఉండొచ్చు లేదా వ్యక్తిగత డేటా లీక్ కావచ్చని స్పష్టం చేశారు.

ఈ ప్రమాదం ఎక్కువగా 18.3 కంటే పాత ఐఓఎస్ వాడుతున్న iPhone XS తర్వాత వచ్చిన మోడల్స్‌కు, అలాగే పాత iPad మోడల్స్‌కు వర్తిస్తుంది. ముఖ్యంగా, iPad Pro 12.9 ఇంచ్ (2వ జనరేషన్ మరియు తరువాతి మోడల్స్), iPad Pro 10.5 ఇంచ్, iPad 6వ జనరేషన్ మరియు దాని తరువాతి వెర్షన్లు, iPad Air 3వ జనరేషన్, iPad Mini 5వ జనరేషన్ వంటి డివైసుల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు.ఇతర వివరాల ప్రకారం, iOS 18.3 కంటే పాతవే కాకుండా, iPadOS 17.7.3 కంటే పాతవి, 18.3 కంటే పాత iPadOS వెర్షన్లు కూడా ఈ భద్రతా లోపాలకు గురయ్యే అవకాశం ఉంది.

సెర్ట్-ఇన్ సూచనల ప్రకారం, వినియోగదారులు తమ ఫోన్లు, ట్యాబ్లెట్లు తాజా సాఫ్ట్‌వేర్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలి. అదేవిధంగా, తెలియని యాప్స్ ఇన్‌స్టాల్ చేయకుండా ఉండాలి. నమ్మకమైన సోర్స్‌ల నుంచే యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని, అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లపై క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలని తెలిపింది.ఈ హెచ్చరికను పరిగణనలోకి తీసుకుని, వినియోగదారులు తమ డివైసుల భద్రతను పెంచుకోవాలని, తక్షణమే అప్‌డేట్ ప్రక్రియ ప్రారంభించాలన్నది కేంద్ర సూచన. సాంకేతిక లోపాలను పట్టించుకోకపోతే, వ్యక్తిగత డేటా ప్రమాదంలో పడే అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది.