ప్రారంభమైన ఇండియన్ ఆర్మీ డే వేడుకలు.. తొలిసారిగా ఢిల్లీ వెలుపల నిర్వహణ.. ఎక్కడంటే ?
ఇండియన్ ఆర్మీ డే వేడుకలు కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రారంభమయ్యాయి. 1949 నుంచి ఈ వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే దేశ చరిత్రలో తొలిసారిగా ఈ వేడుకలను మొదటి సారిగా ఈ సంవత్సరం ఢిల్లీకి వెలుపలు నిర్వహిస్తూ వస్తున్నారు.
భారత సైన్యం 75వ వ్యవస్థాపక దినోత్సవం వేడుకలు కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రారంభమయ్యాయి. 1949లో వేడుకలు మొదలుపెట్టిన తరువాత ఢిల్లీ వెలుపల ఈ వేడుకలు నిర్వహించడం ఇదే తొలిసారి. బెంగళూరులోని మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్ (ఎంఈజీ) సెంటర్లో ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే సమక్షంలో ప్రత్యేక పరేడ్ ప్రారంభమైంది.
మధురైలో ప్రారంభమైన జల్లికట్టు: 800 మంది క్రీడాకారులు.. పలువురికి గాయాలు.. వివరాలు ఇవిగో..
ఆర్మీ సర్వీస్ కార్ప్స్ కు చెందిన మౌంటెడ్ బృందం, ఐదు రెజిమెంటల్ బ్యాండ్ లతో కూడిన మిలటరీ బ్యాండ్ తో పాటు ఎనిమిది టీమ్ లు ఈ పరేడ్ లో పాల్గొంటున్నాయి. వీటితో పాటు బైక్ విన్యాసాలు, స్కైడైవింగ్ కూడా ప్రదర్శించనున్నారు. ఈ కవాతులో ఆర్మీ ఏవియేషన్ ధ్రువ్, రుద్ర హెలికాప్టర్ల ద్వారా ఫ్లై-పాస్ట్ కూడా ఉండనుంది. కే9 వజ్ర సెల్ఫ్ ప్రొపెల్డ్ గన్స్, పినాకా రాకెట్లు, టీ-90 ట్యాంకులు, బీఎంపీ-2 ఇన్ ఫాంట్రీ ఫైటింగ్ వెహికల్, తుంగుస్కా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, 155 ఎంఎం బోఫోర్స్ గన్స్, లైట్ స్ట్రైక్ వెహికల్స్, స్వాతి రాడార్ వంటి ఆయుధ వ్యవస్థలను పరేడ్ లో ప్రదర్శించనున్నారు. ఆర్మీ డే సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వీర సైనికులను కూడా సత్కరిస్తారు.
ప్రతీ సంవత్సరం జనవరి 15 తేదీని భారత్ లో ఇండియన్ ఆర్మీ డేగా జరుపుకుంటారు. భారతదేశపు మొదటి ఆర్మీ చీఫ్, ఫీల్డ్ మార్షల్ కోదండర మాదప్ప కరియప్ప (కెఎమ్ కరియప్ప) గౌరవార్థం ఈ వేడుకలను నిర్వహిస్తారు. కేఎం కరియప్ప 1949 జనవరి 15వ తేదీన చివరి బ్రిటిష్ ఆర్మీ చీఫ్ జనరల్ ఫ్రాన్సిస్ బుట్చేర్ నుంచి ఆర్మీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించారు.
స్వతంత్ర భారత తొలి ఆర్మీ చీఫ్ కె.ఎమ్. కరియప్పను ముద్దుగా 'కీపర్' అని పిలిచేవారు. ఆయన 1900 జనవరి 28న కర్ణాటకలో జన్మించారు. 1947 ఇండో-పాకిస్తాన్ యుద్ధానికి కరియప్ప నాయకత్వం వహించాడు. పదవీ విరమణ తర్వాత ఆయనకు 1986లో ఫీల్డ్ మార్షల్ హోదా లభించింది. దీంతో పాటు రెండో ప్రపంచ యుద్ధంలో బర్మాలో జపనీయులను ఓడించినందుకు ఆయనకు ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ కూడా లభించింది. కాగా.. భారత సరిహద్దులను రక్షిస్తున్న వీర సైనికులకు ప్రతీ ఏడాది జనవరి 15వ తేదీన దేశ మొత్తం సెల్యూట్ చేస్తుంది.