ఇండియాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు: రికవరీల కంటే కొత్త కేసులే అధికం
ఇండియాలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయి. మళ్లీ కేసులు పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా రోగుల రికవరీ కంటే అధిక కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది.
న్యూఢిల్లీ: ఇండియాలో గత 24 గంటల్లో 45,892 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో గత 24 గంటల్లో 817 మంది మరణించారు. ఈ నెల 7వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా 42,32,25,897 శాంపిల్స్ ను పరీక్షించారు. నిన్న ఒక్క రోజే 18,93,800 కరోనా శాంపిల్స్ పరీక్షించారు. వీరిలో 45,892 మందికి కరోనా సోకింది. దేశంలో గత 24 గంటల్లో కరోనా నుండి 44 వేల మంది కోలుకొన్నారు. కానీ కరోనా కేసులు 45,892 నమోదయ్యాయి.
దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 1.50 శాతానికి చేరాయి. కరోనా రోగుల రికవరీ రేటు 97.18 శాతంగా నమోదైందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ తెలిపింది. కరోనా పాజిటివిటీ రేటు 5 శాతానికి తక్కువగా నమోదైంది. ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు 2.37 శాతంగా ఉంది.
దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 4.6 లక్షలకు చేరుకొంది. దేశంలో ఇప్పటివరకు 3,07,09,557 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనా నుండి 2,98,43, 825 మంది కోలుకొన్నారు.కరోనాతో ఇప్పటివరకు 4,05,028 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు 36,48,47,549 మంది వ్యాక్సినేషన్ వేయించుకొన్నారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.