కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో తన బడ్జెట్ ప్రసంగాన్ని ఇస్తూ మహాభారతంలోని శ్లోకాన్ని చదివారు. డైరెక్ట్ ట్యాక్స్ గురించిన వివరాలను ఆమె పేర్కొనడానికి ముందు ఈ శ్లోకాన్ని చెప్పారు. రాజు.. తన ప్రజల యోగక్షేమాల కోసం అన్నింటినీ సమకూర్చాలని పేర్కొన్న శ్లోకాన్ని ఆమె పేర్కొన్నారు. ఈ సారి నిర్మలా సీతారామన్ 90 నిమిషాల్లో ప్రసంగాన్ని ముగించారు. సాధారణంగా ఆమె రికార్డు స్థాయిలో ఎక్కువ సేపు బడ్జెట్ ప్రసంగాన్ని ఇచ్చారు.
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) ఈ రోజు పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగాన్ని(Budget Speech) ఇచ్చారు. ఆమె సాధారణంగా సుదీర్ఘమైన ప్రసంగాన్ని ఇస్తారు. కానీ, ఈ సారి ఆమె ప్రసంగాన్ని సుమారు 90 నిమిషాల నిడివితో ముగించారు. ఈ ప్రసంగాల్లో ఆమె సంస్కృతంలోనివి, లేదా పురాణ, ఇతిహాసాల్లోని కొన్ని శ్లోకాలు, వ్యాఖ్యలు ఉటంకిస్తుంటారు. తాజా ప్రసంగంలోనూ ఆమె ఈ అవకాశాన్ని వదులుకోలేదు. ఈ సారి ఆమె మహాభారతంలోని ఓ శ్లోకాన్ని చదివారు. ప్రత్యక్ష పన్నుల గురించి ఆమె ప్రసంగించడానికి ముందు ఆమె మహాభారత శ్లోకాన్ని వినిపించారు.
కేంద్ర బడ్జెట్ 2022పై నిర్మలా సీతారామన్ ఈ రోజు మాట్లాడుతూ, మహాభారతంలోని శాంతిపర్వం చాప్టర్లోని ఓ శ్లోకాన్ని పేర్కొన్నారు. రాజు ఎప్పుడూ ప్రజల యోగక్షేమాల కోసం దారి తీస్తూ ఉండాలనే శ్లోకాన్ని ఆమె ప్రస్తావించారు. రాజు నిర్లక్ష్యాన్ని కలిగి ఉండరాదని, ధర్మబద్ధంగా పాలన చేయాలని వివరించారు. ఆయన ప్రజల యోగక్షేమాల కోసం అన్నింటినీ సమకూర్చాలని శ్లోకం ఉన్నట్టు తెలిపారు. ఈ శ్లోకం తర్వాత ఆమె ట్యాక్స్పేయర్ల కోసం ఓ సవరణను తెలిపారు. పన్నుదారులు తమ అదనపు ఆదాయంపై పన్ను చెల్లించడానికి కాల పరిమితిని రెండేళ్లకు పొడిగించినట్టు వివరించారు. ఇది ట్యాక్స్ రిటర్న్స్లో లోపాలు ఉన్నట్టైయితే, వాటిని సవరించడానికి మంచి అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కొత్త నిబంధన పన్ను చెల్లింపు విధానాన్ని మరింత సరళతరం చేసిందని తెలిపారు. లిటిగేషన్ తగ్గించి స్వచ్ఛందంగా పన్ను చెల్లించే అవకాశాన్ని కొత్త నిబంధనలు కల్పిస్తున్నాయని వివరించారు.
కాగా, ఈ సారి బడ్జెట్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ డిజిటల్ రూపీ, క్రిప్టో కరెన్సీలపై సంచలన నిర్ణయాలు వెల్లడించారు. రిజర్వ్ బ్యాంక్ ఇండియా ద్వారా డిజిటల్ కరెన్సీని తీసుకురానున్నట్టుగా చెప్పారు. రూపాయికి మరింత బలాన్ని చేకూర్చేలా డిజిటల్ రూపీ ఉండనుందని తెలిపారు. కరెన్సీ కార్యకలాపాల నిర్వహణలో డిజిటల్ కరెన్సీ ఉండనుందని చెప్పారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయంతో రూపొందించనున్నట్టుగా వెల్లడించారు. డిజిటల్ రూపీ విడుదలతో ఆర్థిక వ్యవస్థకు ఉత్సాహం అందుతుందన్నారు. దీనిని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) అని పిలవనున్నారు. ప్రస్తుతం దేశంలో చెలామణీలో ఉన్న భౌతిక కరెన్సీతో పాటే డిజిటల్ కరెన్సీ కొనసాగనుంది.
ఇక, క్రిప్టో కరెన్సీల లావాదేవీలపై 30 శాతం పన్ను విధించనున్నట్టుగా నిర్మలా సీతారామన్ వెల్లడించారు. డిజిటల్ కరెన్సీ ద్వారా ఆదాయం, ఆస్తుల బదిలీపై 30 శాతం పన్ను విధించనున్నట్టుగా చెప్పారు. డిజిటల్ కరెన్సీల ఆదాయంపై పన్ను మినహాయింపుకు అవకాశం లేదని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ప్రైవేట్ టెలికాం ప్రొవైడర్లు 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. ప్రైవేట్ టెలికాం ఆపరేపటర్ల ద్వారా 5G మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన స్పెక్ట్రమ్ వేలం 2022లో నిర్వహించబడుతుందని సీతారామన్ చెప్పారు. 2022-23లోపు 5G మొబైల్ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు. దేశంలోని అన్ని గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ ఏర్పాటు 2025 నాటికి పూర్తవుతుందని నిర్మలా సీతారామన్ చెప్పారు. విజువల్స్, యానిమేషన్ రంగంలో యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ ప్రచారం కోసం ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు.
