గత ఐదేండ్లలో కొత్త హైకోర్టు న్యాయమూర్తులలో 79% మంది అగ్రవర్ణాల వారే..!
New Delhi: న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో ఓబీసీలు, దళితులు, మైనార్టీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించకపోవడానికి కొలీజియం వ్యవస్థ కారణమనే వాదనలు ఉన్నాయి. కోలీజియంలో మార్పులు తీసుకురావడం గురించి ఇటీవల కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు సంచలనమే సృష్టించాయి. తాజా నివేదికల క్రమంలో మరోసారి కొలీజియంపై చర్చ మొదలైంది.
Parliamentary Standing Committee: గత కొంతకాలంగా న్యాయమూర్తుల నియామక ప్రక్రియ కొలీజియం వ్యవస్థపై వస్తున్న వ్యాఖ్యల క్రమంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో ఓబీసీలు, దళితులు, మైనార్టీలకు సరైన ప్రాతినిధ్యం కల్పించకపోవడానికి కొలీజియం వ్యవస్థ కారణమనే వాదనలు ఉన్నాయి. కోలీజియంలో మార్పులు తీసుకురావడం గురించి ఇటీవల కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు సంచలనమే సృష్టించాయి. తాజా రిపోర్టుల నేపథ్యంలో మరోసారి కొలీజియంపై చర్చ మొదలైంది. గత 5 సంవత్సరాలలో, కొత్త హైకోర్టు న్యాయమూర్తులలో 79 శాతం మంది అగ్రవర్ణాలు, ఎస్సీ-మైనారిటీ వర్గాలకు చెందిన వారు 2 శాతం చొప్పున ఉన్నారని తాజా నివేదికల ద్వారా వెల్లడైంది.
కొలీజియం వివాదం నేపథ్యంలో గత ఐదేళ్లలో దేశవ్యాప్తంగా హైకోర్టుల్లో ఎంతమంది న్యాయమూర్తులను నియమించారో న్యాయ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ కమిటీకి తెలిపింది. 2018 నుంచి 2022 డిసెంబర్ 19 వరకు వివిధ హైకోర్టులకు మొత్తం 537 మంది న్యాయమూర్తులను నియమించినట్లు న్యాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీరిలో 79 శాతం మంది అగ్రవర్ణాలు, 11 శాతం ఓబీసీలు, 2.8 శాతం ఎస్సీలు, 2.6 శాతం మంది మైనార్టీలు, 1.3 శాతం మంది ఎస్టీ వర్గాలకు చెందిన న్యాయమూర్తులను నియమించారు.
20 మంది న్యాయమూర్తుల కులాలను నిర్ధారించలేమని న్యాయ మంత్రిత్వ శాఖ పార్లమెంటరీ ప్యానెల్ కు తెలిపింది. ఐదేళ్లలో 537 నియామకాలు జరగ్గా అందులో 271 నియామకాలు బార్ కోటా నుంచి, 266 నియామకాలు సర్వీస్ కోటా ద్వారా జరిగాయి. తాజా రిపోర్టుల నేపథ్యంలో న్యాయమూర్తుల నియామకం, కొలీజియంపై కులానికి సంబంధించి మరోసారి ప్రశ్నలు తలెత్తాయి.
హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి విధివిధానాలు ఏమిటి?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 217(1) ప్రకారం హైకోర్టులో న్యాయమూర్తులను నియమించే హక్కు ఉంది. దీని ప్రకారం ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు సీనియర్ న్యాయమూర్తుల సిఫారసు, సంబంధిత రాష్ట్ర గవర్నర్ తో సంప్రదింపుల ఆధారంగా రాష్ట్రపతి న్యాయమూర్తులను నియమిస్తారు. కొలీజియం పేర్లను చర్చించి సిఫారసును న్యాయ మంత్రిత్వ శాఖకు పంపుతుంది. అప్పుడు మంత్రిత్వ శాఖ ఈ పేర్లను రాష్ట్రపతి కార్యాలయానికి పంపుతుంది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఆమోదం పొందిన తర్వాత ప్రభుత్వం నియామక ఉత్తర్వులను జారీ చేస్తుంది.
కొలీజియంపై ఇప్పటి వరకు పలువురు ప్రముఖులు చేసిన కీలక ప్రకటనలు...
1. కిరణ్ రిజిజు, కేంద్ర న్యాయశాఖ మంత్రి: న్యాయమూర్తుల నియామకాల్లో వైవిధ్యం చూపకపోవడానికి కొలీజియం వ్యవస్థ బాధ్యత వహిస్తుంది. కొలీజియం వ్యవస్థ పరాయివారిలా పనిచేస్తుంది. 5 కోట్లకు పైగా కేసులు ఎందుకు పెండింగ్ లో ఉన్నాయో అందరూ ఆలోచించాలి.
2. జస్టిస్ డీవై.చంద్రచూడ్, సీజేఐ: రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో కొలీజియంతో సహా ఏ సంస్థ పరిపూర్ణమైనది కాదు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలోనే పనిచేయడమే దీనికి పరిష్కారం. కొలీజియంలోని న్యాయమూర్తులందరూ రాజ్యాంగాన్ని అమలు చేసే నమ్మకమైన సైనికులు.
హైకోర్టు న్యాయమూర్తి కావడానికి అర్హత ఏమిటి?
- మొదటి అర్హత భారత పౌరుడు కావడం.
- జడ్జి అవ్వాలంటే న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి.
- సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో న్యాయవాదిగా పదేళ్ల అనుభవం ఉండాలి.