కరొనిల్ సక్సెస్ ... అల్లోపతి వైద్యుల మంట అదే, అందుకే రాందేవ్పై రాద్ధాంతం: ఆచార్య బాలకృష్ణ
పతంజలి సంస్థ అభివృద్ధి చేసిన యాంటీ కోవిడ్ కిట్ అద్భుతమైన విజయం సాధించడంతో అల్లోపతి డాక్టర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని వ్యాఖ్యానించారు ఆ సంస్థ చైర్మన్ ఆచార్య బాలకృష్ణ. బాబా రామ్దేవ్ వ్యాఖ్యలను ఐఎంఏ, అల్లోపతి డాక్టర్లు రాద్ధాంతం చేయడానికి కారణం ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు
పతంజలి సంస్థ అభివృద్ధి చేసిన యాంటీ కోవిడ్ కిట్ అద్భుతమైన విజయం సాధించడంతో అల్లోపతి డాక్టర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని వ్యాఖ్యానించారు ఆ సంస్థ చైర్మన్ ఆచార్య బాలకృష్ణ. బాబా రామ్దేవ్ వ్యాఖ్యలను ఐఎంఏ, అల్లోపతి డాక్టర్లు రాద్ధాంతం చేయడానికి కారణం ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు. బాబా రామ్దేవ్ కేవలం తనకు వచ్చిన వాట్సాప్ మెసేజ్ను మాత్రమే చదివారని, డాక్టర్లను బాధిస్తున్నది స్వయంగా అల్లోపతియేనని బాలకృష్ణ అన్నారు.
అల్లోపతి వైద్యులపై చేసిన వ్యాఖ్యలను బాబా రామ్దేవ్ ఇప్పటికే ఉపసంహరించుకున్నారని ఆయన గుర్తుచేశారు. అలాంటపుడు ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయడం సరి కాదని ఆచార్య బాలకృష్ణ హితవు పలికారు. వందలాది మంది డాక్టర్లు సైతం అల్లోపతి ద్వారా నయంకానటువంటి వ్యాధులకు ఆయుర్వేద చికిత్స కోసం హరిద్వార్లోని బాబా రామ్దేవ్ ఆశ్రమానికి వస్తున్నారని ఆయన గుర్తుచేశారు.
Also Read:రాందేవ్బాబా వివాదాస్పద వ్యాఖ్యలు: రూ. 1000 కోట్లకు పరువు నష్టం దావా వేసిన ఐఎంఏ
ఆచార్య బాలకృష్ణ మే 24న ఇచ్చిన ట్వీట్లో, యావత్తు దేశాన్ని క్రైస్తవంలోకి మార్చే కుట్రలో భాగంగానే యోగాను, ఆయుర్వేదాన్ని అపఖ్యాతిపాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. యోగా రుషి రామ్దేవ్ను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా యోగాను, ఆయుర్వేదాన్ని అపఖ్యాతిపాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశ ప్రజలు ఇకనైనా మేలుకోవాలని, లేకపోతే భవిష్యత్ తరాలు క్షమించవని బాలకృష్ణ హెచ్చరించారు.
కాగా, అల్లోపతి వైద్యంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురువు రాందేవ్ బాబాపై ఉత్తరాఖండ్ ఐఎంఏ రూ. 1000 కోట్ల పరువు నష్టం దావా వేసింది. 15 రోజుల్లో లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. ఈ మేరకు రామ్దేవ్ బాబాకు నోటీసులు పంపింది.