ఐఐటీ బొంబాయిలో మెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ‘‘ శాఖాహారం మాత్రమే ’’ టేబుల్‌పై దుమారం రేపుతోంది. ఈ సందర్భంగా నిరసన తెలిపిన విద్యార్ధికి ఐఐటీ యాజమాన్యం రూ.10,000 జరిమానా విధించింది.

ఐఐటీ బొంబాయిలో మెస్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ‘‘ శాఖాహారం మాత్రమే ’’ టేబుల్‌పై దుమారం రేపుతోంది. దీనిపై విద్యార్ధులు ఆందోళన సైతం నిర్వహించారు. అయితే ఈ నిరసన జరిగిన చాలా రోజుల తర్వాత వారిలో ఒకరికి ఐఐటీ యాజమాన్యం రూ.10,000 జరిమానా విధించింది. ఇన్‌స్టిట్యూట్‌లోని 12, 13, 14 హాస్టళ్లలని మెస్ కౌన్సిల్ గత వారం సాధారణ మెస్ ప్లేస్‌లో శాకాహారుల కోసం ఆరు టేబుళ్లను రిజర్వ్ చేసింది. అయితే మెస్‌ను ఇలా విభజించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్ధులు ‘‘ వెజ్ ఓన్లీ’’టేబుల్‌లో ఒకదాని వద్ద నాన్ వెజ్ ఆహారాన్ని తింటూ శాంతియుతంగా నిరసన తెలపడంతో వివాదం చెలరేగింది. 

ఈ మొత్తం వ్యవహారంపై విచారణ జరిపిన కమిటీ.. కొందరు విద్యార్ధులు బలవంతంగా ఇన్‌స్టిట్యూట్ వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని గుర్తించింది. ఇద్దరు విద్యార్ధుల్లో ఒకరికి రూ.10 వేల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని అతని స్పెషల్ మెన్షన్ అకౌంట్స్ (ఎస్ఎంఏ) ఖాతా నుంచి మినహాయించనున్నట్లు సదరు విద్యార్ధికి హాస్టల్ మేనేజర్ ఈ మెయిల్ ద్వారా సమాచారం అందించారు. విద్యార్ధుల నిరసన  నేపథ్యంలో వచ్చిన ఫిర్యాదులపై చర్చించేందుకు మెస్ కౌన్సిల్ సమావేశం జరిగింది.