సారాంశం

కేరళలో విషాదం చోటు చేసుకుంది. కారు నదిలో పడిపోవడం వల్ల ఇద్దరు యువ డాక్టర్లు నీటిలో మునిగి, ఊపిరాడక చనిపోయారు. ఆ కారులో ఉన్న మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే గూగుల్ మ్యాప్ ను ఫాలో అవుతూ కారు నడపడం వల్ల.. అది నేరుగా నదిలోకి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

గూగుల్ మ్యాప్ ను నమ్ముకొని కారు డ్రైవ్ చేస్తే అది నేరుగా నదిలోకి తీసుకెళ్లింది. దీంతో ఆ కారులో ఉన్న ఇద్దరు డాక్టర్లు నీటిలో మునిగి, ఊపిరాడక చనిపోయారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకులం జిల్లా గోతురుత్ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి సమయంలో చోటు చేసుకుంది. 

వివరాలు ఇలా ఉన్నాయి. కొచ్చి జిల్లాలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్స్ లో అద్వైత్ (29), అజ్మల్ ఆసిఫ్ (29 డాక్టర్లుగా పని చేస్తున్నారు. అయితే శనివారం అద్వైత్ పుట్టిన రోజు కావడంతో షాపింగ్ చేయాలని భావించారు. దీని కోసం ఆయన ఆసిఫ్ ను అలాగే ఓ హాస్పిటల్ లో పని చేసే మేల్ నర్స్ జిస్మోన్, ఎంబీబీఎస్ చదువుతున్న తమన్నా, మరో హాస్పిటల్ లో పని చేస్తున్న డాక్టర్ తబ్సీర్ కలిసి ఓ కారులో కొచ్చి నుంచి కొడుంగల్లూర్ కు శనివారం రాత్రి సమయంలో బయలుదేరారు. 

అయితే అదే సమయంలో భారీగా వర్షం పడుతోంది. దీంతో కారు డ్రైవింగ్ చేస్తున్న అద్వైత్ జీపీఎస్ ఆన్ చేశారు. అయితే ఆ కారు ఎర్నాకుళం జిల్లా గోతురుత్ ప్రాంతానికి చేరుకుంది. అందులో సూచించిన విధంగా కారు డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో అర్థరాత్రి 12.30 గంటల ప్రాంతాలో ఆ కారు నేరుగా పెరియార్ నదిలోకి వెళ్లిపోయింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న డాక్టర్ అద్వైత్, డాక్టర్ ఆసిఫ్ నీటిలో మునిగి, ఉపిరాడకపోవడంతో చనిపోయారు. 

మిగిలిన ముగ్గుర ఎలాగోలా ప్రాణాలతో భయటపడ్డారు. అయితే ప్రాణాలతో బయటపడ్డ డాక్టర్ తబ్సీర్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ.. జీపీఎస్ దారి మళ్లించడంతో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ‘‘అవును.. కారులో ఉన్న సమయంలో మేము జీపీఎస్ వాడుతున్నాం. కాను నేను ఆ సమయంలో డ్రైవింగ్ చేయలేదు. కాబట్టి ఇది జీపీఎస్ సాంకేతిక లోపమా ? లేక మానవ తప్పిదమా అనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేను’ అని అన్నారు. 

భారీ వర్షం వల్ల ఆ సమయంలో డ్రైవింగ్ చేస్తున్న సమయంలో రోడ్డు సరిగా కనిపించలేదని పోలీసులు తెలిపారు. అందుకే వారు గూగుల్ మ్యాప్ లో చూపించిన దారిని ఫాలో అవుతున్నారని పేర్కొన్నారు. కానీ డ్రైవింగ్ చేసే వ్యక్తి మ్యాప్ లో సూచించనట్టుగా ఎడమవైపు తిప్పకుండా పొరపాటున ముందుకు వెళ్లడంతో నదిలో పడిపోయిందని తెలుస్తోందని చెప్పారు.