ఓ వ్యక్తి ఉన్నట్టుండి కుర్చీలోనే కుప్పకూలాడు. అది చూసిన వెంటనే స్పందించి సీపీఆర్ చేసి అతని ప్రాణాలు కాపాడారు ఐఏఎస్ అధికారి యశ్ పాల్ గార్గ్.
చండీగఢ్ : ఇటీవల కాలంలో ఉన్నట్టుండి కుప్పకూలి మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. అలాగే జరిగింది చండీగఢ్లో. కానీ సకాలంలో ఓ ఐఏఎస్ అధికారి స్పందించి అతడికి సిపిఆర్ చేయడంతో అతని ప్రాణాలు నిలిచాయి. ఈ ఘటనతో ఆ ఐఏఎస్ అధికారిపై ప్రశంసల జల్లు కురుస్తుంది. ఓ వ్యక్తి అకస్మాత్తుగా కుర్చీలోనే కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన ఐఏఎస్ అధికారి యశ్ పాల్ గార్గ్ అతడికి సకాలంలో సిపిఆర్ చేసి ప్రాణాలను కాపాడారు. యశ్ పాల్ గార్గ్ ఛండీగఢ్ లో ఆరోగ్య శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఈ ఘటన మంగళవారం చండీగఢ్లో చోటుచేసుకుంది. సకాలంలో స్పందించి కార్డియా పల్మనరీ రీసస్కిటేషన్ (సీసీఆర్) చేసి వ్యక్తిని కాపాడి ప్రస్తుతం అందరి ప్రశంసలు అందుకుంటున్నారు యశ్ పాల్ గార్గ్.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే… మంగళవారం చండీగఢ్లోని సెక్టార్ 41 కి చెందిన జనక్ లాల్ అనే వ్యక్తి ఏదో పనిమీద చండీగఢ్ హౌసింగ్ బోర్డు ఆఫీసుకు వచ్చారు. కాసేపటికి అకస్మాత్తుగా జనక్ లాల్ కూర్చున్న చోటే కుప్పకూలారు. చుట్టూ ఉన్నవాళ్లంతా గుండెపోటుగా అనుమానించారు. ఈ విషయం కార్యాలయంలోనే ఉన్న ఐఏఎస్ అధికారి యశ్ పాల్ గార్గ్ కి తెలిసింది. అతను వెంటనే తన సీట్ లో నుంచి పరుగెత్తుకుని వచ్చారు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి సిపిఆర్ చేశారు. అతని ప్రాణాలు కాపాడారు. దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు.
గంజాయి సరఫరా చేస్తున్న దంపతులు అరెస్టు.. 205 కిలోల గంజాయి స్వాధీనం..
ఈ వీడియోకు క్యాప్షన్ చేరుస్తూ స్వాతి మలివాల్ ఇలా రాశారు..‘ చండీగఢ్ ఆరోగ్యశాఖ కార్యదర్శి యశ్ పాల్ గార్గ్ జీ చేసిన పని ఎంతో ప్రశంసనీయం. గుండెపోటు నుంచి ఒకరి ప్రాణాలు కాపాడారు. ఆయన తక్షణమే స్పందించి సిపిఆర్ చేశారు. ప్రతి ఒక్కరు సిపిఆర్ నేర్చుకోవాలి’ అని ఆమె పేర్కొన్నారు. సిపిఆర్ తరువాత సదరు వ్యక్తి వెంటనే స్పృహలోకి వచ్చాడు.
ఈ ఘటనపై చండీగఢ్ ఆరోగ్యశాఖ కార్యదర్శి, ఐఏఎస్ ఆఫీసర్ యశ్పాల్ గార్గ్ స్పందిస్తూ.. ‘నేను నా ఆఫీసు గదిలో పనిచేసుకుంటూ ఉన్నాను. ఇంతలో పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ రాజీవ్ తివారి నా దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. సిహెచ్బి సెక్రెటరీ చాంబర్ దగ్గర ఎవరో వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడని తెలిపాడు. వెంటనే నాకు విషయం అర్థమైంది.. అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లాను. సిపీఆర్ చేశాను’ అని చెప్పుకొచ్చారు. జనక్ లాల్ కు సిపిఆర్ అందించిన తర్వాత దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ఈసీజీ తీశారు. ఆస్పత్రిలో చేర్చుకున్నారు. ప్రస్తుతం జనక్ లాల్ అబ్జర్వేషన్ లో ఉన్నట్టు అధికారులు తెలిపారు.
