కర్ణాటక నూతన సీఎం ఎవరనే నిర్ణయాన్ని తమ పార్టీ అధిష్టానానికి అప్పగించినట్టుగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. ఏక వ్యాఖ్య తీర్మానం చేశామని.. పార్టీ అధిష్టానానికే నిర్ణయం వదిలివేశామని చెప్పారు.
బెంగళూరు: కర్ణాటక నూతన సీఎం ఎవరనే నిర్ణయాన్ని తమ పార్టీ అధిష్టానానికి అప్పగించినట్టుగా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. ఏక వ్యాఖ్య తీర్మానం చేశామని.. పార్టీ అధిష్టానానికే నిర్ణయం వదిలివేశామని చెప్పారు. తాను ఢిల్లీ వెళ్లాలనే దానిపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ తనపై నమ్మకం ఉంచి పీసీసీ ప్రెసిడెంట్గా నియమించారని.. తాము ఘన విజయం సాధించామని చెప్పారు. తాను ఏం పని చేయాలో అది విజయవంతంగా చేశానని చెప్పారు.
ఈరోజు తన పుట్టినరోజు అని.. పలువురు పార్టీ శ్రేణులు తనను కలిసేందుకు వస్తున్నారని చెప్పారు. తాను కూడా టెంపుల్కు వెళ్లి పూజల్లో పాల్గొననున్నట్టుగా తెలిపారు. అయితే ఈ సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానం బర్త్ డే గిఫ్ట్ ఇస్తుందా? అని ప్రశ్నించగా.. తమ పార్టీ విజయమే తనకు బర్త్ డే గిఫ్ట్ అని డీకేశివకుమార్ అన్నారు. ప్రజలు తమకు 136 సీట్లు ఇచ్చారని.. పుట్టినరోజుకి ఇంతకంటే ఏం గిఫ్ట్ కావాలని అన్నారు. ఇదిలా ఉంటే.. డీకే శివకుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఆయన నివాసానికి భారీగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. కర్ణాటక సీఎంగా సిద్దరామయ్య, డీకే శివకుమార్లలో ఎవరిని నియమించాలనే దానిపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే, పార్టీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్, మాజీ ప్రధాన కార్యదర్శి దీపక్ బబారియా కేంద్ర పరిశీలకులుగా ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలోని బెంగళూరులో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆదివారం అర్దరాత్రి వరకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాలకు బాధ్యునిగా ఉన్న రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా హాజరయ్యారు. అయితే ఎమ్మెల్యే నుంచి అభిప్రాయాలు తీసుకున్న పరిశీకుల బృందం ఢిల్లీకి బయలుదేరింది.
వారు ఎమ్మెల్యేల అభిప్రాయాలు, ఇతర విషయాలతో కూడిని నివేదికను కాంగ్రెస్ అధిష్టానానికి అందజేయనున్నారు. ‘‘ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలు తీసుకున్నాం. అర్దరాత్రి 2 గంటల వరకు సమావేశం కొనసాగింది. మేము ఒక నివేదికను సిద్ధం చేసాము. దానిని కాంగ్రెస్ అధ్యక్షుడికి సమర్పిస్తాము’’ అని ఏఐసీసీ పరిశీలకుడు జితేంద్ర సింగ్ తెలిపారు.
