భార్యను హతమార్చి రెండు ముక్కలు చేసి నదిలో పడేసిన భర్త.. అక్రమ సంబంధం అనుమానంతో ఘాతుకం
పశ్చిమ బెంగాల్లో ఓ వ్యక్తి తన భార్యను గొంతు నులిమి చంపేసి ఆమె శరీరాన్ని రెండుగా నరికేశాడు. అనంతరం, ఆ శరీర భాగాలను నదిలో విసిరేశాడు. వివాహేతర సంబంధం పెట్టుకున్నదనే అనుమానంతో ఈ ఘాతుకానికి నిందితుడు ఒడిగట్టాడు. మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
కోల్కతా: ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అత్యంత దారుణ హత్య దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఎక్కడ డెడ్ బాడీని ముక్కలు చేసి చంపేసిన ఘటన జరిగినా శ్రద్ధా వాకర్ మర్డర్ ఎపిసోడే గుర్తుకు వస్తున్నది. తాజాగా, శ్రద్ధా వాకర్ హత్య తరహాలోనే పశ్చిమ బెంగాల్లోనూ ఓ మర్డర్ జరిగింది.
తన భార్య వేరే పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకున్నదని ఆ భర్త అనుమానించాడు. ఆ అనుమానం ఏకంగతా భార్యను చంపేసే దాకా తీసుకెళ్లింది. తన భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత రెండు ముక్కలు చేసి మహానంద నదిలో విసిరేసి వచ్చాడు. ఆమె బంధువులు పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
డార్జిలింగ్ జిల్లా సిలిగురిలో ఈ దుర్ఘటన జరిగింది. తాజాగా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఆ బాడీ శరీర భాగాలను గాలించే పనిలో ఉన్నారు. డైవర్స్ ఆమె శరీర భాగాలను వెతుకుతున్నారు.
సిలిగురిలో నివసించే రేణుకా ఖాతున్ కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఆమె బంధువులు గత నెల చివరి వారంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా పోలీసులు రేణుక భర్త మొహ్మద్ అన్సరుల్ ను విచారించారు. ఈ విచారణలో భార్య రేణుకను తానే చంపేశానని భర్త మొహమ్మద్ అన్సరుల్ అంగీకరించాడు. అంతేకాదు, ఆమె డెడ్ బాడీని రెండుగా ముక్కలు చేసి నదిలో పడేసినట్టు తెలిపాడు.
పోలీసులు ప్రకారం, అన్సరుల్ తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు అనుమానించాడు. ఆ తర్వాతే తన భార్యను చంపాలని నిర్ణయం తీసుకున్నాడు. డిసెంబర్ 24వ తేదీన తన భార్యను అన్సరుల్ గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆమె శరీరాన్ని రెండుగా ముక్కలు చేశాడు. డైవర్ల సహకారంతో రేణుక శరీర భాగాలను ట్రేస్ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.