2015 జూన్లో పోలీసు కస్టడీలో చనిపోయిన ఓ వ్యక్తి కేసులో అతని భార్యకు రూ. 5 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించించింది.
రాంచీ : కస్టడీలో మరణించిన బాధితుడి భార్యకు 5 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని జార్ఖండ్ హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయన మృతికి కారణమైన పోలీసు సిబ్బందిపై విచారణకు కూడా ఆదేశించింది. 2015 జూన్లో ధన్బాద్లో తన భర్తను అరెస్ట్ చేసిన పోలీసులు చిత్రహింసలు పెట్టారని పిటిషనర్, బబితా దేవి ఆరోపించారు. తన భర్త శరీరంపై అనేక గాయాలు ఉన్నాయని తెలిపింది. అతను పోలీసు కస్టడీలో చనిపోయాడని గుర్తించడంతో హైకోర్టును ఆశ్రయించింది.
ఆమె భర్త ఉమేష్ సింగ్ను ఆ రోజు ఉదయం విడుదల చేస్తామని బబితాదేవికి పోలీసులు సమాచారం అందించారు. ఆ తర్వాత మహిళ భర్త అనేక గాయాలతో చనిపోయాడు. ఆమె అక్కడికి చేరుకునేసరికే అతను చనిపోయినట్లు తెలిపారు. దీనిమీద రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తును సిఐడికి అప్పగించింది.
తన భర్తను పోలీసులు కొట్టడంతోనే మృతి చెందాడంటూ మృతుడి భార్య హై కోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన హైకోర్టు, ఇది కస్టడీ మరణానికి ఉదాహరణగా గుర్తించింది. దీంతో మృతుడి భార్యకు రూ. 5 లక్షల పరిహారాన్ని ఆరు వారాల్లోగా విడుదల చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
