Asianet News TeluguAsianet News Telugu

బాలీవుడ్ ముద్దుగుమ్మలు ఆ ఆర్థిక నేరస్తుడి ఉచ్చులో ఎలా చిక్కారు? తెర వెనుక ఏం జరిగింది?

రూ. 200 కోట్ల స్కామ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్ దర్యాప్తు ఎదుర్కొంటున్నాడు. ఆ మాయగాడి ఉచ్చులో కొందరు బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు చిక్కారు. జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహీ సహా పలువురు నటులు ఆయనతో పరిచయంలోకి వెళ్లారు. ఆ తర్వాత దర్యాప్తు సంస్థల ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇంతకు ఆ ఆర్థిక నేరస్తుడితో వీరు ఎలా పరిచయంలోకి వెళ్లారు. సుకేశ్‌కు వీరిని పరిచయం చేసిన వారు ఎవరు? వీరితో సుకేశ్ ఏం మాట్లాడాడు? వంటి విషయాలు చూద్దాం.
 

how these bollywood famouse celebrities got into touch with conman sukesh chandrasekhar who is accused in 200 crore scam case
Author
First Published Sep 18, 2022, 4:29 PM IST

న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్లు కొందరు ఆర్థిక నేరగాడు సుకేశ్ చంద్రశేఖర్ కేసులో చిక్కుకున్నారు. రూ. 200 కోట్ల స్కామ్ కేసులో సుకేశ్ చంద్రశేఖర్‌ను ఈడీ విచారిస్తున్నది. ఈ దర్యాప్తులో భాగంగా బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నోరా ఫతేహీలను ఈడీ ప్రశ్నించింది. వీరితోపాటు నికితా తంబోలీ, చాహత్ ఖన్నా, సోఫియా సింగ్, అరుష పాటిల్‌లూ సుకేశ్ చంద్రశేఖర్ కనెక్షన్‌లోకి వెళ్లారు. అసలు వీరు ఆ మాయగాడి ఉచ్చులో ఎలా పడ్డారు. వీరిని ఒక చోట చేర్చిన ఆ తెర వెనుక మనిషి ఎవరు? సుకేశ్ చంద్రశేఖర్ ఎలా ప్రముఖ హీరోయిన్లను కలుసుకోగలిగారు? ఈ విషయాలను చూద్దాం. ఇందుకోసం ఈడీ దర్యాప్తులో హీరోయిన్లు చెప్పిన సమాధానాలను ఆధారంగా తీసుకుందాం.

జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను ఎలా కలుసుకున్నాడు?

సుకేశ్ చంద్రశేఖర్‌కు జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌ను పింకీ ఇరానీ అనే మహిళ పరిచయం చేసింది. సుకేశ్ చంద్రశేఖర్ గురించి జాక్వెలిన్ ఫెర్నాండేజ్‌కు తప్పుడు సమాచారం ఇచ్చింది. ఈ ఆరోపణలను ఈడీ పింకీ ఇరానీపై మోపింది. పింకీ ఇరానీ సహాయతోనే సుకేశ్ చంద్రశేఖర్.. యాక్టర్లను జైలులో కలుసుకోగలిగాడు. వారికి ఖరీదైన బహుమతులు అందించగలిగాడు. చంద్రశేఖర్ తరఫున ఆమెనే ఆ బహుమానాలు ఇచ్చేది.

సుకేశ్ చంద్రశేఖర్ తప్పుడు ఐడెంటిటీతో జాక్వెలిన్‌తో పరిచయం చేసుకున్నాడు. తాను సన్ టీవీ యజమాని అని, జయలలిత కుటుంబానికి చెందినవాడని తనతో పరిచయం చేసుకున్నట్టు నటి జాక్వెలిన్ ఈడీకి తెలిపింది. 2020 డిసెంబర్, 2021 జనవరి మధ్య కాలంలో తనతో టచ్‌లోకి రావడానికి సుకేశ్ చంద్రశేఖర్ ప్రయత్నించాడని ఆమె వివరించింది. కానీ, ఆయన కాల్స్‌కు ఆమె రెస్పాండ్ కాలేదని తెలిపింది. ప్రభుత్వ కార్యాలయం నుంచి కూడా ఒకరు తనతో కాంటాక్ట్ అయ్యారని, సుకేశ్‌తో టచ్‌లోకి రావాలని చెప్పారని పేర్కొంది.

2021 అక్టోబర్‌లో సుకేశ్ లాయర్ అనంత్ మాలిక్ మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు. సుకేశ్‌, జాక్వెలిన్‌లు డేటింగ్ చేస్తున్నారని చెప్పారు. ఆ వ్యాఖ్యలను ఆమె ఖండించారు. ఆ తర్వాత వారిద్దరూ క్లోజ్‌గా ఉన్న కొన్ని ఫొటోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం అయ్యాయి.

నోరా ఫతేహీతో ఎలా టచ్‌లోకి వెళ్లాడు?

ఎక్స్‌టార్షన్ కేసులో ఢిల్లీ పోలీసులు నోరా ఫతేహీని ఆరు గంటలపాటు ప్రశ్నించారు. 2020 డిసెంబర్‌లో చెన్నైలో ఓ కార్యక్రమానికి హాజరు కావడంపై ఆమెను ప్రశ్నించారు. అది తన ఏజెన్సీ ఎక్సీడ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా బుక్ అయిందని వివరించారు. ఆ ఈవెంట్‌లో తాను సుకేశ్ భార్య లీనా మేరియా పాల్‌ను కలిసిందని తెలిపారు. అప్పుడే ఆమె తనకు గుచ్చి బ్యాగ్, ఐఫోన్ ఇచ్చారని వివరించారు. సుకేశ్ తనకు పెద్ద ఫ్యాన్ అని లీనా చెప్పిందని పేర్కొన్నారు. కానీ, సుకేశ్ తనను కలువడం కుదరదని వివరించారని తెలిపారు. అందుకే లీనా ఫోన్‌లో స్పీకర్ పెట్టి ఇద్దరితో మాట్లాడించారని పేర్కొన్నారు. ఆయన తనకు థాంక్స్ చెప్పారని, ఆయన తనకు పెద్ద అభిమానిని అని వివరించారని నోరా ఫతేహీ తెలిపారు. ఆ తర్వాత లీనా తనకు కొత్త బీఎండబ్ల్యూ కారును అభిమానంగా  బహుమానం చేస్తున్నట్టు ప్రకటించిదని, కానీ, తనకు అప్పటికే ఒక బీఎండబ్ల్యూ కారు ఉన్నదని తిరస్కరించానని చెప్పారు.

సుకేశ్‌ను జైలులో కలుసుకున్న ఇతర యాక్టర్లు!

నలుగురు చిన్ననటులు, మోడల్స్ నికితా తంబోలీ, చాహత్ ఖన్నా, సోఫియా సింగ్, అరుష పాటిల్‌లు సుకేశ్ చంద్రశేఖర్‌ను ఢిల్లీ జైలులో ఉన్నప్పుడు కలుసుకున్నారని ఇండియా టుడే ఓ కథనంలో పేర్కొంది. తీహార్ జైలులో అతన్ని కలుసుకోవడానికి వీళ్లు పింకి ఇరానీ ద్వారా వెళ్లారు. వేర్వేరు పేర్లతో వారికి సుకేశ్‌ను ఇంట్రడ్యూస్ చేసింది. సుకేశ్‌ను కలువడానికి వచ్చినందుకు వారికి డబ్బులు, గిఫ్టులు ఇచ్చారు. ఈ నలుగురిలో అరుష పాటిల్ మాత్రమే పింకీ ఇరానీ ద్వారా సుకేశ్ చంద్రశేఖర్‌ను కలిశానని అంగీకరించారు. కానీ, జైలులో కాదని పేర్కొన్నారు. అందులో ఎక్కువ మందికి శేఖర్‌ అనే పేరుతో సుకేశ్ పరిచయం చేసుకున్నాడు. ఇండస్ట్రీలో తాను పెద్ద వ్యక్తిని అని చెప్పుకున్నట్టు తెలిసింది.

Follow Us:
Download App:
  • android
  • ios