తన కూతురు వేరే కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతోందన్న కోపంతో తండ్రి ఆమె గొంతుకోసి ఫ్యాన్‌కు ఉరివేసాడు.

బెంగళూరు : కర్నాటకలో ఓ తండ్రి కిరాతకానికి పాల్పడ్డాడు. పరువు కోసం కన్న కూతురిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనలో అతని 20 ఏళ్ల కుమార్తె మృతి చెందింది. ఆమె మరణవార్త విని తట్టుకోలేక ఆమె ప్రేమికుడు ఎదురుగా వస్తున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కెజిఎఫ్)లోని బంగారుపేట నివాసి కృష్ణమూర్తి.. అతని కూతురు కీర్తి. ఆమె వేరే కులానికి చెందిన 24 ఏళ్ల గంగాధర్‌ ను ప్రేమించింది. తాను అతడినే వివాహం చేసుకుంటానని పట్టుబట్టడంతో తండ్రీ కూతుళ్ల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి.

కూతురిని చంపేముందు రోజు కూడా కృష్ణమూర్తి కూతురితో గొడవపడ్డాడు. గంగాధర్ తో ప్రేమ, పెళ్లి మానుకోవాలని చెప్పాడు. దానికి కీర్తిని మరోసారి ఒప్పించేందుకు ప్రయత్నించాడు, దీంతో తండ్రి, కూతురు తీవ్ర స్థాయిలో గొడవ పడడానికి దారితీసిందని పోలీసు అధికారి తెలిపారు. గొడవ తీవ్రస్థాయికి చేరడంతో కృష్ణమూర్తి కీర్తిని గొంతుకోసి చంపేశాడు. ఆపై హత్యను ఆత్మహత్యగా మార్చేందుకు ఆమె మృతదేహాన్ని ఫ్యాన్‌కు ఉరివేశాడు.

మేకను ఇంటికి తీసుకువచ్చాడని.. హౌసింగ్ సొసైటీలో కలకలం.. పోలీసుల చొరవతో...

కీర్తి ఆత్మహత్య గురించి పోలీసులకు తెలియడంతో.. ఘటనా స్థలానికి చేరుకున్న వారికి అనుమానం వచ్చింది. కీర్తిది ఆత్మహత్య కాదని.. హత్య అని అనుమానించి కృష్ణమూర్తిని విచారించడం ప్రారంభించారు. ఈ లోపు తాపీ మేస్త్రీగా పనిచేస్తున్న గంగాధర్‌ కీర్తి మృతి విషయం తట్టుకోలేకపోయాడు. సమీపంలోని రైలు పట్టాల వద్దకు వెళ్లి ఎదురుగా వస్తున్న రైలు ముందు దూకి అక్కడికక్కడే మృతి చెందాడు.

భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 302 కింద కృష్ణమూర్తిని హత్య కేసులో అరెస్టు చేశామని కేజీఎఫ్ పోలీస్ సూపరింటెండెంట్ కె ధరణి దేవి తెలిపారు.