Heat wave alert: ఎండలు మండిపోతున్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని పేర్కొంటూ.. భారత వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Heat wave alert: వేసవికాలం ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. మధ్యాహ్నాం వేళ ఎండల తీవ్రత మరింత అధికంగా ఉండటంతో జనాలు బయటకు రావడానికి భయపడిపోతున్నారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు దేశంలోని మధ్య ప్రాంతంలో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. IMD పేర్కొన్న వివరాల ప్రకారం.. ఈ ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలో వేగంగా పెరుగుదల కూడా నమోదవుతుంది.
గుజరాత్లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలు, కొంకణ్ ప్రాంతం, పశ్చిమ రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్, గుజరాత్, తూర్పు రాజస్థాన్, ఒడిశాలోని చాలా ప్రాంతాలలో బలమైన వేడి గాలులు వీచే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. ఇప్పటికే దేశంలోని దేశంలోని చాలా ప్రాంతాల్లోవేడిగాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రానున్న 2 రోజుల్లో వాయువ్య భారతం, పశ్చిమ మధ్యప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో గరిష్టంగా ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని IMD తెలిపింది. రాబోయే 2 రోజుల్లో, మహారాష్ట్రలోని అంతర్గత ప్రాంతాలు మరియు ఈశాన్య భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీల వరకు పెరగవచ్చు అని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. మరోవైపు, ముంబయి మరియు పొరుగు జిల్లాల్లో మండుతున్న వేడి పరిస్థితుల దృష్ట్యా, శరీరం డీహైడ్రేషన్కు గురికాకుండా, మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లకుండా సురక్షితంగా ఉండాలని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) పౌరులకు విజ్ఞప్తి చేసింది.
ఎండల్లో అధికంగా ఉండే వారు వడదెబ్బ బారినపడే అవకాశముందని తెలిపింది. వడదెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని BMC సూచించింది. దీని వల్ల తీవ్ర అనారోగ్య ముప్పు బారినపడే అవకాశం తగ్గుతుందని తెలిపింది. ప్రజలు నీళ్లతో పాటు ఇతర పరిశుభ్రమైన ద్రవ పదర్థాలు తీసుకోవడం పెంచాలని కూడా సూచించింది. ముఖ్యంగా మధ్యాహ్నం వేళల్లో బయటకు వెళ్లే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. బుధవారం నాడు ఉష్ణోగ్రతలు పెరగనున్న నేపథ్యంలో ఇప్పటికే భారత వాతావరణ విభాగం (IMD) ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు రోజుల్లో ముంబయిలో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యే అవకాశం ఉందని IMD అంచనా వేసింది.
మరోవైపు రానున్న 24 గంటల్లో హిందూ మహాసముద్రం, బంగాళాఖాతం దగ్గర అల్పపీడనం ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవుల్లో ఫిబ్రవరి 19 వరకు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని, ఈ సమయంలో గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
